న్యూఢిల్లీ, జనవరి 6: బ్యాంక్ ఖాతాదారులు ‘నో యువర్ కస్టమర్’ (కేవైసీ) అప్డేట్ కోసం ఇకపై బ్యాంకుల చుట్టూ తిరగనక్కర్లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త మార్గదర్శకాల ప్రకారం వ్యక్తిగత ఖాతాదారులు తమ ఈ-మెయిల్ ఐడీ, బ్యాంక్ ఖాతాతో అనుసంధానమైన మొబైల్ నెంబర్లతోపాటు ఆన్లైన్/ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్, ఏటీఎంలు, మరే ఇతర డిజిటల్ వేదికల ద్వారానైనా సెల్ఫ్-డిక్లరేషన్ను సమర్పించి కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు. అయితే చిరునామా మారితే రెండు నెలల్లోగా బ్యాంకులు వెరిఫికేషన్ ప్రక్రియను ముగించాల్సి ఉంటుంది. కాబట్టి వ్యక్తిగత వివరాల ఆధునికీకరణ కోసం వినియోగదారులు దగ్గర్లోని శాఖలను సందర్శించాలని బ్యాంకులు పట్టుబట్టకూడదని కూడా తాజా మార్గదర్శకాల్లో ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇక కేవైసీ సమాచారంలో ఏ మార్పూ లేనట్టయితే కేవైసీ పునఃపరిశీలన ప్రక్రియ పూర్తయ్యేందుకు ఖాతాదారు ఇచ్చే సెల్ఫ్-డిక్లరేషన్ సరిపోతుందని కూడా ఆర్బీఐ తెలియజేసింది.
బ్యాంకుల్లో ఇప్పటికే ఉన్న ఖాతాదారుల వ్యక్తిగత సమాచారంతో వారి పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, వోటర్ ఐడీ, ఆధార్, ఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డ్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ లేఖ తదితర ప్రధాన ధ్రువపత్రాల్లోని వివరాలు భిన్నంగా ఉన్నప్పుడు కేవైసీ అప్డేట్ అవసరమవుతుంది. అలాగే గతంలో కేవైసీ అప్డేట్ కోసం మీరు బ్యాంక్కు సమర్పించిన డాక్యుమెంట్ల గడువు తీరిపోయినా మళ్లీ కేవైసీ అప్డేట్ అవసరం. అయితే ఇటువంటి కేసుల్లో ఖాతాదారు సమర్పించిన కేవైసీ డాక్యుమెంట్లు/సెల్ఫ్-డిక్లరేషన్కు సంబంధించి బ్యాంకులు రశీదును ఇవ్వాల్సి ఉంటుందని ఆర్బీఐ ఈ సందర్భంగా పేర్కొన్నది. ఖాతాదారుల వ్యక్తిగత వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని, సమీక్షలు నిర్వహించి లోపాలను సరిదిద్దుకోవాలని, మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002కు అనుగుణంగా నడుచుకోవాలని బ్యాంకర్లను ఆర్బీఐ పదేపదే కోరుతున్న సంగతి విదితమే.