హైదరాబాద్, ఆగస్టు 13: దేశంలో అతిపెద్ద ఇనుప ఖనిజ ఉత్పత్తి సంస్థ ఎన్ఎండీసీ భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4.6 కోట్ల టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైర్టెర్ సుమిత్ దేబ్ తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ 4.21 కోట్ల టన్నులు ఉత్పత్తి చేయగా, 4.05 కోట్ల టన్నుల ఖనిజాన్ని విక్రయించింది. దీంతో గతేడాది రూ.25,882 కోట్ల టర్నోవర్ సాధించింది. బాచెలి మైన్, కుమారస్వామి మైన్, ఇతర గనులు అభివృద్ధి చేస్తుండటంతో వచ్చే మార్చి నాటికి ఉత్పత్తి 4.60 కోట్ల టన్నులకు చేరుకుంటుందని ఆశిస్తున్నట్ల చెప్పారు. గతేడాది ఉత్పత్తి చేసిన దానికంటే 10 శాతం అధికమని తాజా వార్షిక నివేదికలో పేర్కొంది.
డీమెర్జింగ్ ఈ ఏడాదిలోనే..
ఛత్తీస్గఢ్లో ఉన్న మూడు స్టీల్ ప్లాంట్ల డీమెర్జింగ్ ఈ ఏడాదిలోనే పూర్తికానున్నదని ఆయన చెప్పారు. ఈ యూనిట్లను విడగొట్టే ప్రతిపాదనకు ఇటీవల కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే ఈ ప్రతిపాదనకు వాటాదారులు కూడా ఓకే చెప్పారని, స్టాక్ ఎక్సేంజ్ల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా జారీ అయినట్లు ఆయన చెప్పారు. బాచెలీ గనుల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఐదో లైన్ ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానున్నట్లు, దీంతో మరో 25 లక్షల టన్నుల ఉత్పత్తి కానున్నదన్నారు.
రెండో స్థానంలో భారత్
ఇనుప ఖనిజ ఉత్పత్తిలో భారత్ దూసుకుపోతున్నది. ప్రపంచ దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. 240 మిలియన్ టన్నులతో ఈ స్థానం దక్కింది. 800 మిలియన్ టన్నులతో ఆస్ట్రేలియా తొలి స్థానంలో ఉండగా,మూడో స్థానంలో బ్రెజిల్, ఆ తర్వాతి స్థానంలో చైనా ఉన్నది.