ముంబై: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రిలయన్స్ ఫౌండేషన్ వ్వవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ ‘ది హర్ సర్కిల్ ఎవ్రిబడి ప్రాజెక్టు’ను ప్రారంభించారు. మహిళల్లో భౌతికపరమైన ఆత్మన్యూనతా భావాన్ని పారదోలి వారిలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం.. శరీర పరిమాణం, వయసు, రంగు, మతం, భౌతికపరమైన వివక్షలేని సమానమైన అవకాశాలను కల్పించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.
2021 లో మహిళా దినోత్సవం సందర్భంగా నీతా అంబానీ ‘హర్ సర్కిల్’ డ్రైవ్ను ప్రారంభించారు. మహిళలకు సురక్షిత, సంపూర్ణ అభివృద్ధిదాయకమైన డిజిటల్ ప్లాట్ఫామ్ను కల్పించడమే ‘హర్ సర్కిల్’ ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం రెండో వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో మహిళల సంఖ్య 310 మిలియన్లకు (31 కోట్లు) చేరింది.
కాగా, ‘హర్ సర్కిల్ ఎవ్రిబడి’ ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా నీతా అంబానీ ఒక వీడియో సందేశం ఇస్తూ.. ‘హర్ సర్కిల్’ అంటే మహిళల్లో సోదరీ భావం పెంపొందించడంతోపాటు సంఘీభావం ప్రకటించడం అని పేర్కొన్నారు. సమానత్వం, ఏకత్వం, అందరినీ గౌరవించడం అనే సూత్రాల ప్రాతిపదికన సంఘీభావం ఏర్పడుతుందని, ఇదే తమ కొత్త ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని ఆమె చెప్పారు.
సోషల్ మీడియాలో మహిళలపై దారుణంగా ట్రోలింగ్స్ జరుగుతున్నాయని, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోకుండానే వారిని ట్రోల్ చేస్తున్నారని నీతా అంబానీ అన్నారు. వైద్య పరమైన సమస్యలు, లింగ వివక్షకు సంబంధించిన సమస్యలు వంటి అనేక అంశాల్లో మహిళలు పోరాడుతుంటారని, కానీ అవేవీ తెలుసుకోకుండా కొందరు ట్రోలింగ్ చేస్తుంటారని విమర్శించారు. ఇలాంటి ట్రోల్స్ మహిళలకు ముఖ్యంగా యువతులకు తీరని నష్టాన్ని కలిగిస్తాయని నీతా అంబానీ అభిప్రాయపడ్డారు. ఇలాంటి అనేక సమమస్యలకు తమ కొత్త ప్రాజెక్టు పరిష్కారం సూచించగలదని ఆమె చెప్పారు.
‘హర్ సర్కిల్’ ఎలా పనిచేస్తుంది..?
‘హర్ సర్కిల్’ అనే సామాజిక, డిజిటల్ ప్లాట్ఫామ్ మహిళల అభ్యున్నతి కోసం వారు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కార వేదికగా పనిచేస్తుంది. జీవనమార్గం, ఆరోగ్యం, ఆర్థికం, వ్యక్తిత్వ వికాసం, సామాజిక సేవ, అందం, ఫ్యాషన్, వినోదం, సృజనాత్మకత, భావ వ్యక్తీకరణ, ప్రజా జీవితంలో చురుకైన పాత్ర పోషించడం తదితర అనేక అంశాలపై మహిళల సారథ్యంలోని ఎన్జీఓలు, ఇతర సంస్థలు పరిష్కారాలను సూచిస్తాయి. సూచనలను తెలియజేస్తాయి. ఆరోగ్యం, సంక్షేమం, విద్య, వ్యాపారం, ఆర్థికం, దాతృత్వం, నాయకత్వ లక్షణాలు లాంటి అంశాలపై రిలయన్స్కు చెందిన నిపుణులు మహిళలకు తగిన సూచనలు, సలహాలు ఇస్తారు. ఈ వేదిక ద్వారా మహిళలు తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకుని ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణించే అవకాశం లభిస్తుంది.