న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitaraman ) ఈ నెల 15న (సోమవారం) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థికశాఖ మంత్రులతో సమావేశం కానున్నారు. ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం ప్రైవేటు పెట్టుబడులను ఎలా ఆకర్షించాలనే అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
2020, మార్చి నుంచి దేశాన్ని కరోనా మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేసింది. మధ్యలో తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభించింది. ఇలా రెండు కరోనా వేవ్లు దేశ ఆర్థికవ్యవస్థను కుదేలు చేశాయి. లాక్డౌన్లు, నైట్ కర్ఫ్యూల కారణంగా వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు స్తంభించిపోయాయి. పరిశ్రమలు మూతపడ్డాయి. దాంతో ప్రజలు, ప్రభుత్వాలు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల స్థాయిలో ఆర్థికవ్యవస్థలను మెరుగుపర్చడానికి ఉన్న అవకాశాలు, సవాళ్లు, సమస్యలపై సోమవారం నాటి సమావేశంలో చర్చించనున్నారు.