Sensex | ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు అందడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 659 పాయింట్లతో లాభ పడింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 659.31 పాయింట్ల లాభంతో 59, 688.22 పాయింట్ల వద్ద సెన్సెక్స్ స్థిర పడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 174.35 పాయింట్ల లాభంతో 18 వేలకు చేరువలో 17,798.75 పాయింట్ల వద్ద ముగిసింది.
రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడటంతోపాటు గురువారం ఒక్కరోజే ఐటీ, బ్యాంకింగ్ స్క్రిప్టులు సోమవారం ట్రేడింగ్ను ముందు ఉండి నడిపించాయి. గురువారం ఒక్కరోజే మదుపరుల సంపద రూ.2 లక్షల కోట్లకు పైగా పెరిగింది. బుధవారం బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.80 లక్షల కోట్లుగా నమోదైతే, గురువారం అది రూ.2.82 లక్షల కోట్లకు దూసుకెళ్లింది.
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 90 డాలర్ల దిగువకు చేరుకుంది. పూర్తిగా దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలకు సానుకూల అంశంగా మారింది. మరోవైపు అమెరికా మార్కెట్లు లాభాలతో ముగియడం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చింది. టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ స్టాక్స్.. బీఎస్ఈ సెన్సెక్స్లో లాభపడ్డాయి. మరోవైపు టాటా స్టీల్, ఎన్టీపీసీ, టైటాన్, నెస్ట్లే ఇండియా, పవర్ గ్రిడ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లు స్వల్ప నష్టాలను చవి చూశాయి.
విదేశీ ఇన్స్ట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) షేర్ల కొనుగోలుకు ప్రాధాన్యం ఇవ్వడం కూడా దేశీయ మార్కెట్లలో సానుకూలతకు కారణంగా తెలుస్తున్నది. ఎఫ్ఐఐలు బుధవారం ట్రేడింగ్లో రూ.758.37 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు ఈ నెలలో రూ.2,646 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో డాలర్తోపాటు రూపాయి మారకం విలువ స్వల్పంగా బలపడింది.