ముంబై, జనవరి 4: తక్షణ చెల్లింపు సేవ (ఐఎంపీఎస్) లావాదేవీల పరిమితిని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రూ.5 లక్షల వరకు పెంచింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ పెంపు వర్తిస్తుందని తాజా ప్రకటనలో పేర్కొన్నది. ప్రస్తుతం ఐఎంపీఎస్ లావాదేవీల పరిమితి రూ.2 లక్షల వరకే ఉన్నది. కాగా, ఖాతాదారులు డిజిటల్ బ్యాంకింగ్ను అలవర్చుకునేలా ప్రోత్సాహక నిర్ణయాన్నీ బ్యాంక్ తీసుకున్నది. ఇందులో భాగంగానే ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా ఐఎంపీఎస్ లావాదేవీ రూ.5 లక్షల వరకు ఉన్నా.. సర్వీస్ చార్జీ ఉండదని ప్రకటించింది. బ్యాంక్ శాఖల్లో జరిపితే మాత్రం రూ.20 చార్జీ (జీఎస్టీ అదనం) పడుతుందని స్పష్టం చేసింది.