హైదరాబాద్, అక్టోబర్ 5: ప్రస్తుత పండుగ సీజన్లో విక్రయదారులకు శుభవార్తను అందించింది అమెజాన్. నూతన విక్రయదారులకు ఫీజు రుసుములపై 50 శాతం మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రత్యేక స్కీం నవంబర్ 4 వరకు అమలులో ఉండనున్నది. ఆన్లైన్లో తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు రాష్ట్రంలోని చిన్న, పెద్ద ఉత్పత్తి సంస్థలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్టు, రివార్డు కింద రూ.11,500 వరకు అందుకునే అవకాశం కూడా కల్పించినట్టు అమెజాన్ ఇండియా డైరెక్టర్ అమిత్ నందా తెలిపారు.
ప్రస్తుతం సంస్థకు తెలంగాణలో 50 వేల మంది చిన్న విక్రయదారులు ఉండగా, అదే దేశవ్యాప్తంగా 14 లక్షలు ఉన్నారు. ప్రస్తు త పండుగ సీజన్లో 81 శాతం మంది కన్జ్యూమర్లు ఆన్లైన్లోనే తమకు నచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేయనున్నట్టు నీల్సన్ మీడియా సర్వేలో వెల్లడించింది. మెట్రో నగరాలతోపాటు చిన్న నగరాల్లోనూ ఆన్లైన్ కస్టమర్లు క్రమంగా పెరుగుతున్నారని పేర్కొంది.
ప్రస్తుత పండుగ సీజన్లో లక్ష సీజనల్ ఉద్యోగాలను తీసుకోనున్నట్టు అమెజాన్ ప్రకటించింది. హైదరాబాద్తోపాటు ముంబై, ఢిల్లీ, పుణె, బెంగళూరు, కోల్కతా, లక్నో, చెన్నై నగరాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా అవకాశాలు లభించనున్నాయని పేర్కొంది. ఈ నెల 8న ప్రారంభంకానున్న అమెజాన్ గ్రేడ్ ఇండియన్ ఫెస్టివలను దృష్టిలో పెట్టుకొని సీజనల్ సిబ్బందిని రిక్రూట్ చేసుకుంటున్నది సంస్థ.