New Parliament | బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని తెలుస్తున్నది. తదనుగుణంగా వచ్చేనెల ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పార్లమెంట్ భవనం `లోక్సభ`లోనే బడ్జెట్ సమర్పిస్తారని సమాచారం. అయితే బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు ఎక్కడ జరుగుతాయన్న సంగతి మాత్రం ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటన చేయలేదు.
ఈ మేరకు నూతన పార్లమెంట్ భవన చిత్రాలను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంవోహెచ్యూఏ) వెబ్సైట్లో షేర్ చేసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గత నవంబర్ నాటికి నిర్మాణం, డెకరేషన్ పనులు పూర్తి చేయాల్సి ఉన్నా.. ఈ నెలాఖరుకల్లా పనులన్నీ కంప్లీట్ అవుతాయని అధికారులు చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో పూర్తిగా బడ్జెట్ సమావేశాలు కొత్త పార్లమెంట్లో జరుగుతాయా? మలి విడుత బడ్జెట్ సమావేశాలు జరుగుతాయా? అన్న విషయమై స్పష్టత లేదు. సమావేశాలను నిర్వహించడానికి నూతన పార్లమెంట్లో ఏర్పాట్లు చేసేందుకు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (సీపీడబ్ల్యూడీ) టెండర్లు జారీ చేసింది. మెకనైజ్డ్ హౌసింగ్ కీపింగ్తోపాటు ఏర్పాట్ల కోసం రూ.24.65 కోట్లతో టెండర్లు పిలిచారు. 2020లో టాటా సన్స్ గ్రూప్కు కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ కాంట్రాక్ట్ అప్పగించింది కేంద్రం.
నూతన పార్లమెంట్ భవన నిర్మాణ కాంట్రాక్ట్ను అప్పట్లో రూ.861.9 కోట్లకు టాటా సన్స్కు కేటాయించినా.. ఖర్చు దాదాపు రూ.1,200 కోట్లకు చేరుతుందని నివేదికలు వస్తున్నాయి. భవన నిర్మాణంపై పెరిగిన జీఎస్టీకి అనుగుణంగా ఖర్చు పెరుగుతుందని అంటున్నారు. గతేడాది భవన నిర్మాణ పనులపై జీఎస్టీని కేంద్రం 12 నుంచి 18 శాతానికి పెంచేసింది.
కొత్త లోక్సభ భవనంలో 888 సీట్లు ఏర్పాటు చేశారు. భవిష్యత్లో పార్లమెంట్ సీట్లు పెంచినా వెసులుబాటుగా ఉండేలా భవన నిర్మాణం సాగినట్లు తెలుస్తున్నది. ఇక రాజ్యసభ భవనంలో 384 సీట్లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే, సెంట్రల్ విస్టా పేరుతో రూపుదిద్దుకున్న కొత్త పార్లమెంట్ భవనంలో నిర్మించిన అన్ని హాళ్లు, గదుల్లోనూ టెక్నాలజీ వసతులు కల్పించారు. నూతన ఆడియో, వీడియో సిస్టమ్స్ అందుబాటులోకి తెచ్చారు.