New ITR forms | ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25 మదింపు) ఐటీ రిటర్న్స్ సమర్పించడం కోసం ఐటీఆర్ ఫామ్స్ నోటిఫై చేసిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వాటిల్లో కీలక మార్పులు చేసింది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వేతన జీవులు తమ బ్యాంకు ఖాతాల వివరాలు, వాటిల్లో నగదు స్వీకరణ (receipt of cash) వివరాలు తెలియజేయాలని పేర్కొంది. వేతన జీవుల వార్షిక వేతనం రూ.50 లక్షలు దాటని వారు, ఒక ఇల్లు ఉన్నవారు, ఇతర వనరులు (వడ్డీ)తోపాటు వ్యవసాయ ఆదాయం రూ.5000 లోపు ఉన్నవారు ఐటీఆర్-1 (సహజ్) ఫామ్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఇక నుంచి ఐటీఆర్ ఫైల్ చేసే వేతన జీవులు తమ బ్యాంకు ఖాతాల వివరాలు, సేవింగ్స్ లేదా కరంట్ లేదా డీమ్యాట్ ఖాతా వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. గతేడాది వరకూ ఈ వివరాలు తెలియజేయడం ఆప్షనల్ మాత్రమే. అగ్నిపథ్ స్కీం కింద సైనిక బలగాల్లో పనిచేస్తున్న యువకులు లేదా అగ్నివీర్లకు ఆదాయం పన్ను చట్టం-1961లోని 80సీసీహెచ్ సెక్షన్ కింద పన్ను మినహాయింపునకు ప్రత్యేకంగా సెక్షన్ కేటాయించారు.
హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్యూఎఫ్), సంస్థలు, వ్యాపారం, వృత్తి నిపుణుల ఆదాయం రూ.50 లక్షల వరకు ఉంటే ఐటీఆర్-4 (సుగమ్) దాఖలు చేయాల్సి ఉంటుంది. గతేడాది ఫిబ్రవరిలోనే ఐటీఆర్ ఫామ్స్ను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నోటిఫై చేసింది. ఇంతకుమందు `క్రిప్టో కరెన్సీ`కి స్పెషల్ కాలమ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఐటీఆర్-4 ఫామ్లో మీకు వచ్చిన ఆదాయం వివరాలు బయట పెట్టాలని పేర్కొన్నారు. సాధారణంగా ప్రతియేటా మార్చి, ఏప్రిల్ నెలల్లో ఆయా ఆర్థిక సంవత్సరాల ఐటీఆర్ ఫామ్స్ నోటిఫై చేస్తారు. వచ్చే ఏడాది జూలై 31 లోగా వేతన జీవులు ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది.