హైదరాబాద్, ఫిబ్రవరి 10(బిజినెస్ బ్యూరో): దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను పన్నులు చెల్లించిన తర్వాత రూ.1,528 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,335 కోట్ల లాభంతో పోలిస్తే 14 శాతం అధికమని పేర్కొంది. వాహన విక్రయాలు టాప్గేర్లో దూసుకుపోవడం వల్లనే లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఆదాయం 41 శాతం అధికమై రూ.15,349 కోట్ల నుంచి రూ.21,654 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది.
మహీంద్రా వాహన ధరలు పెంచబోతున్నది. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న ఉద్గార నిబంధనలతో వాహన ధరలు రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకు అధికమవనున్నాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ధరల పెంపుపై చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు.
జహీరాబాద్లో వెయ్యి కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ వాహన ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. ఈ ప్లాంట్లో తయారైన తన తొలి ఎలక్ట్రిక్ వాహనం వచ్చే ఏడాది అందుబాటులోకి రావచ్చునని మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ జేజురికర్ ఆశాభావం వ్యక్తంచేశారు. ట్రాక్టర్ల తయారీ ప్లాంట్లోనే ఈవీ యూనిట్ను 100 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్నట్లు, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి భూమి అవసరం లేదని ఆయన స్పష్టంచేశారు. ఈ-ఆటోలు, ఈ-జీతోను ఈ నూతన ప్లాంట్లో తయారు చేస్తున్నట్లు చెప్పారు. కమర్షియల్గా ఉత్పత్తి మాత్రం మూడేండ్ల నుంచి ఐదేండ్లు పట్టొచ్చన్నారు. వచ్చే ఐదేండ్లలో మొత్తం ఎస్యూవీ వాహన విక్రయాల్లో 20 శాతం నుంచి 30 శాతం వరకు ఈవీలు లక్ష్యంగా పెట్టుకున్నది.
ఆటో విభాగం అంచనాలకుమించి రాణించింది. వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతుండటంతో మార్కెట్ వాటా పెరుగుతున్నది. ఈ రెండు విభాగాలను మరింత బలోపేతం చేయడానికి మరిన్ని పెట్టుబడులు పెడుతాం’
– అనీశ్ షా, ఎంఅండ్ఎం ఎండీ, సీఈవో