Direct Tax Mopup | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ నెల మధ్య వరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 45 శాతం పెరిగి రూ.3.39 లక్షల కోట్లకు పైగా చేరాయి. అందులో కార్పొరేట్ టాక్స్ (సీఐటీ) రూ.1.70 లక్షల కోట్లకు పైగా, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్టీటీ)తోపాటు వ్యక్తిగత ఆదాయం పన్ను (పీఐటీ) రూ.1.67 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ 16 వరకునికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.3,39,225 కోట్లకు చేరాయి. 2021-22లో ఇదే కాలంలో కేవలం రూ.2,33,651 కోట్లు వసూలు అయ్యాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో 45 శాతం పన్ను వసూళ్లు పెరిగాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శుక్రవారం తెలిపింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అడ్వాన్స్ టాక్స్ కలెక్షన్స్ రూ.1.01 లక్షల కోట్లకు పైగా జరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.75,783 కోట్లు మాత్రమే అడ్వాన్స్ టాక్స్ కలెక్షన్ జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 33 శాతానికి పైగా పెరిగాయి. ఇందులో కార్పొరేట్ ఇన్కం టాక్స్ రూ.78,842 కోట్లు, వ్యక్తిగత ఆదాయంపై పన్ను రూ.22,175 కోట్లుగా ఉన్నాయి.