Direct Tax Collection | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.13.73 లక్షల కోట్లకు చేరుతాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శనివారం వెల్లడించింది. 2021-22తో పోలిస్తే ఇది 17 శాతం వృద్ధి. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రత్యక్ష పన్నుల వసూళ్ల సవరించిన అంచనా ప్రకారం మొత్తం లక్ష్యంలో 83 శాతానికి చేరుతుందని సీబీడీటీ తెలిపింది. వ్యక్తిగత ఆదాయం పన్ను, కార్పొరేట్ టాక్స్ కలిసి ప్రత్యక్ష పన్నుల వాటాలోకి వస్తాయి. స్థూలంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లు 22.58 శాతం వృద్ధితో రూ.16.68 లక్షల కోట్లకు చేరనున్నాయి.
స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లలో గతేడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ నెల 10 వరకు రూ.2.95 లక్షల కోట్లు రీఫండ్ చేశామని సీబీడీటీ వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రీఫండ్స్ 59.44 శాతం ఎక్కువ. ప్రత్యక్ష పన్ను వసూళ్లలో రీఫండ్స్ పోగా నికరంగా రూ.13.73 లక్షల కోట్లు. ఇది గతేడాదితో పోలిస్తే 16.78 శాతం అధికం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పూర్తి బడ్జెట్ అంచనాల్లో ప్రత్యక్ష పన్నుల వాటా 96.67 శాతం అయితే, సవరించిన అంచనాల ప్రకారం 83.19 శాతం మాత్రమే. రీఫండ్స్ సర్దుబాటు తర్వాత కార్పొరేట్ ఇన్కం టాక్స్ (సీఐటీ) వసూళ్లు 13.62 శాతం వృద్ధి చెందితే.. వ్యక్తిగత ఆదాయం పన్ను ప్లస్ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్టీటీ) కలిపి 20.06 శాతం అని సీబీడీటీ వెల్లడించింది.