Direct Tax Collection | ప్రత్యక్ష పన్ను వసూళ్లలో సరికొత్త రికార్డు నమోదైంది. 2021-22తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-నవంబర్ మధ్య ప్రత్యక్ష పన్ను వసూళ్లు 24 శాతం పెరిగి రూ.8.77 లక్షల కోట్లకు పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సోమవారం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్ అంచనాల్లో పన్ను వసూళ్లు 61.79 శాతంగా నిలిచాయి. ‘గత నెలాఖరు నాటికి 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.8.77 లక్షల కోట్లకు చేరాయి. ఇది 2021-22తో పోలిస్తే 24.26 శాతం ఎక్కువ’ అని ఆర్థిక మంత్రిత్వశాఖ ట్వీట్ చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.14.20 లక్షల కోట్ల మేరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు జరుగుతాయని గత ఫిబ్రవరి బడ్జెట్ అంచనాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంచనా వేశారు. 2021-22లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.10 లక్షల కోట్లకు చేరాయి. వ్యక్తిగత ఆదాయం పన్ను, కార్పొరేట్ పన్నును ప్రత్యక్ష పన్నుల పద్దు కింద పరిగణిస్తారు. ఏ దేశంలోనైనా ఆర్థిక కార్యకలాపాల పురోగతికి పన్ను వసూళ్లు ఒక ఇండికేటర్గా పరిగణిస్తారు.
జీఎస్టీ వసూళ్లు ప్రతి నెలా రూ.1.45 నుంచి రూ.1.50 లక్షల మధ్య నమోదవుతున్నాయి. గత ఏప్రిల్ నుంచి నవంబర్ నెలాఖరు వరకు రీఫండ్స్ రూపంలో రూ.2.15 లక్షల కోట్లు చెల్లించినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే 67 శాతం ఎక్కువ.