గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో సుమారు 5.89 కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయి. కేంద్ర ప్రభుత్వ నిర్దేశిత గడువు గత నెలాఖరు నాటికి కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్లో చివరి రోజు శుక్రవారం ఒక్కరోజే 46.11 లక్షలకు పైగా ఐటీఆర్లు దాఖలయ్యాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి గడువు 2021 జనవరి 10 నాటికి 5.95 కోట్ల ఐటీఆర్లు దాఖలయ్యాయి. గతేడాది జనవరి 10న చివరి రోజు 31.05 లక్షల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయి.
గత ఆర్థిక సంవత్సరానికి దాఖలైన 5.89 కోట్ల ఐటీఆర్లలో ఐటీఆర్-1 పత్రాలు 2.92 కోట్లతో 49.6 శాతం, ఐటీఆర్-2 పత్రాలు 54.8 లక్షలు (9.3 శాతం), ఐటీఆర్-3 ఫామ్స్ 71.05 లక్షలు (12.1 శాతం), ఐటీఆర్-4 పత్రాలు 1.60 కోట్లు (27.2 శాతం), ఐటీఆర్-5 పత్రాలు 7.66 లక్షలు (1.3 శాతం), ఐటీఆర్ -6 పత్రాలు 2.58 లక్షలు, ఐటీఆర్-7 ఫామ్స్ 0.67 లక్షలు దాఖలయ్యాయి. 45.7 శాతానికి పైగా ఐటీఆర్లు ఆన్లైన్ ఐటీఆర్ ఫామ్లను ఉపయోగించి దాఖలు చేశారు. మిగతా ఐటీఆర్లను ఆఫ్లైన్ సాఫ్ట్వేర్ టూల్స్తో ఫైల్ చేశారని ఐటీ శాఖ తెలిపింది.