AI-IMF | ఉద్యోగ అవకాశాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నుంచి ముప్పు పొంచి ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టాలినా జార్జివా హెచ్చరించారు. ‘జాబ్ మార్కెట్’పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ‘సునామీ’లా విరుచుకు పడబోతున్నదన్నారు. ‘ఏఐ’ వల్ల వచ్చే రెండేండ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాల్లో సమూల మార్పులు రానున్నాయని జ్యురిచ్లో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు. ఏఐ బేస్డ్ చాట్బోట్ల తయారీ కోసం గ్లోబల్ టెక్ దిగ్గజ సంస్థలు పోటీ పడుతున్న నేపథ్యంలో క్రిస్టాలినా జార్జివా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల 60 శాతం, ప్రపంచవ్యాప్తంగా 40శాతం ఉద్యోగాలు కనుమరుగు అవుతాయని క్రిస్టాలినా జార్జివా హెచ్చరించారు. ఇందుకోసం ప్రజలు, వ్యాపారులు సన్నద్ధం కావాల్సి ఉందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో కొన్ని రంగాల్లో ఉత్పాదకత పెరిగి సామర్థ్యం మరింత మెరుగు పడుతుందన్నారు. ఏఐ బేస్డ్ చాట్ బోట్లను సరిగ్గా నిర్వహించకుంటే తప్పుడు సమాచార వ్యాపించడంతోపాటు ఆర్థిక, ఆదాయ అసమానతలకు దారి తీస్తుందన్నారు. వాతావరణ పరిస్థితులే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందంటూ క్రిస్టాలినా జార్జివా వ్యాఖ్యానించారు. దీనికి పరిష్కార మార్గాలు వెతకాల్సి ఉందని పేర్కొన్నారు.