TATA SONS | టాటా సన్స్ చైర్మన్గా ఎన్ చంద్రశేఖరన్ మళ్లీ నియమితులయ్యారు. మరో ఐదేండ్ల పాటు ఆయన్ను ఈ పదవిలో కొనసాగించాలని టాటా సన్స్ బోర్డు శుక్రవారం నిర్ణయించింది. బాంబే హౌస్లో జరిగిన బోర్డు సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. 2017 ఫిబ్రవరిలో బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖరన్ పదవీ కాలం ఈ నెల 20తో ముగియాల్సి ఉంది. గత ఐదేండ్లుగా చంద్రశేఖరన్ పనితీరు, సాధించిన ఫలితాల ఆధారంగా ఆయన్ను తిరిగి టాటా సన్స్ చైర్మన్గా నియమించాలని నిర్ణయించింది. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడి హోదాలో హాజరైన టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా కూడా.. చంద్రశేఖరన్ హయాంలో టాటా గ్రూప్ పురోగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
టాటా సన్స్ చైర్మన్గా తిరిగి ఎన్నికవ్వడం పట్ల చంద్రా అలియాస్ చంద్రశేఖరన్ సంతోషం వ్యక్తం చేశారు. గత ఐదేండ్లుగా టాటా గ్రూప్కు సారధ్యం వహించడం ప్రత్యేకమైన హక్కు. మరో ఐదేండ్లు అవకాశం కల్పించినందుకు ఆనందంగా ఉందన్నారు. ఇంతకుముందే చంద్రశేఖరన్ను టాటా సన్స్ రెండోసారి చైర్మన్గా నియమితులవుతారని ఓ ఆంగ్ల దిన పత్రిక వార్తాకథనం ప్రచురించింది.
టాటా సన్స్ ఫ్యామిలీ నుంచి సంస్థ చైర్మన్గా నియమితులైన రెండో వ్యక్తి చంద్రశేఖరన్. అంతకుముందు 2012లో రతన్టాటా స్థానంలో నియమితులైన సైరస్మిస్త్రీ పట్ల టాటా సన్స్ బోర్డు డైరెక్టర్లలో విశ్వాసం సన్నగల్లింది. దీంతో మిస్త్రీని పక్కకు తప్పించిన టాటా సన్స్ బోర్డు.. తాత్కాలికంగా రతన్టాటాను చైర్మన్గా నియమించింది.. తర్వాత సంస్థలోనే ఐటీ సేవలందిస్తున్న అనుబంధ టీసీఎస్ సారధి చంద్రశేఖరన్ను టాటా సన్స్ చైర్మన్గా ఎంపిక చేసింది.
అంతకుముందు సైరస్మిస్త్రీ నుంచి ఎదురైన న్యాయపరమైన సవాళ్లను అధిగమించడంలో చంద్రశేఖరన్ కీలకంగా వ్యవహరించారు. నాటికే టీసీఎస్లో తన సామర్థ్యాన్ని రుజువుకు చేసుకున్న చంద్రాకు ఇన్వెస్టర్లు, వ్యాపార భాగస్వాముల విశ్వాసాన్ని చూరగొన్నారు. న్యాయ వివాదాలతో మసకబారిన టాటా గ్రూప్కు పూర్వ వైభవం తేవడంలో కీలకంగా వ్యవహరించారు.
ఎయిరిండియాను టేకోవర్ చేయడంతో టాటా సన్స్చైర్మన్ చంద్రా ఘటన విజయం సాధించారు. అలాగే సుప్రీంకోర్టులో తమ వాటా తమకు కేటాయించాలని సైరస్మిస్త్రి చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేయడం చంద్రా సాధించిన ప్రధానవిజయాల్లో ఒకటి. ఇలా పలు విజయాలు సాధించి.. టాటా తర్వాత సంస్థ చైర్మన్గా మంచి పనితీరు కనబరిచారని ప్రశంసలు అందుకున్నారు.