డెట్రాయిట్, జూన్ 6: ట్విట్టర్ టేకోవర్ డీల్లో తాజాగా మరో ట్విస్ట్ ఏర్పడింది. మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ను కొనుగోలు చేసేందుకు తాను కుదుర్చుకున్న డీల్ నుంచి వైదొలగుతానంటూ ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ హెచ్చరించారు. మస్క్ డీల్ గడువు ముగిసిందంటూ గత వారాంతంలో ట్విట్టర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే నకిలీ/స్పామ్ ఖాతాల వివరాలను తనకు అందించకపోతే, 44 బిలియన్ డాలర్ల లావాదేవీని రద్దు చేసుకుంటానని సోమవారం ట్విట్టర్కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఒప్పంద భాగస్వామిగా ట్విట్టర్ బాధ్యతల నిర్వహణను పూర్తిగా విస్మరించిందని, కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేయడానికి అన్ని హక్కులూ తనకు ఉన్నాయని ఆ లేఖలో మస్క్ వివరించారు. గత ఏప్రిల్లో ఒప్పందం కుదిరిన కొద్ది రోజులుకే డీల్ను స్పామ్ అకౌంట్స్ డాటాను కోరుతూ మస్క్ డీల్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒప్పందంలో నిర్దేశించిన బాధ్యతల్ని పాటించేందుకు ట్విట్టర్ నిరాకరిస్తున్నదని, నకిలీ ఖాతాలు 5 శాతాన్ని మించి ఉంటాయన్న తన సొంత విశ్లేషణకు అనుగుణంగా డాటా ఉంటుందన్న ఆందోళనతోనే కంపెనీ తనకు సమాచారం ఇవ్వడం లేదని మస్క్ ఆరోపించారు.