Maruti Suzuki on EV | భారత్ కార్ల తయారీ మార్కెట్లో నంబర్ వన్గా నిలవడమే తమ లక్ష్యం అని మారుతి సుజుకి న్యూ మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈవో హిసాషి టాకౌచీ చెప్పారు. ఇందుకోసం బహుళ ఎలక్ట్రిక్ వెహికల్స్ మోడల్స్ను ఆవిష్కరిస్తామని అన్నారు. తద్వారా ఇతర కార్ల తయారీ సంస్థలకు గట్టి పోటీ ఇస్తామన్నారు. 2025లో తొలి ఈవీ మోడల్ కారును మార్కెట్లోకి తేవడానికి మారుతి సుజుకి ప్రణాళికలు సిద్ధం చేసింది. అంతే కాదు.. వినియోగదారుల నుంచి వచ్చే డిమాండ్కు అనుగుణంగా తమ ఫ్యాక్టరీల నుంచి ఉత్పత్తి పెంచడానికి కూడా ప్రణాళికలు రూపొందించింది. సుజుకి మోటార్ గుజరాత్ ప్లాంట్ నుంచి తొలి ఈవీ కారు మార్కెట్లోకి రానున్నది.
భారత్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రవేశపెట్టిన తమ పోటీదారుల కంటే కొంచెం వెనుకబడి ఉన్నాం అని హిసాషి టాకౌచీ అన్నారు. క్రమంగా 50 శాతం మార్కెట్ను అందుకుంటామన్నారు. ఇప్పటికీ దేశీయంగా ఈవీ కార్లకు డిమాండ్ పరిమితంగా ఉందని, సేల్స్ కూడా చాలా చాలా తక్కువగా ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
తాము కూడా ప్రస్తుతం వివిధ మోడల్ కార్లను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు చాలా విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని టాకౌచీ అన్నారు. ప్రస్తుతం పెట్రోల్ లేదా డీజిల్ వినియోగ ఇంజిన్ కార్లలో బ్యాటరీలు, మోటార్స్ వాడకంపై దృష్టి కేంద్రీకరించామన్నారు. భారత్లో వాతావరణానికి అనుగుణంగా దాదాపు ఏడాది కాలానికి పైగా ప్రస్తుత మోడల్ కార్లపై పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఈవీ టెక్నాలజీ చాలా మంచిదని, కానీ భారత్ వంటి దేశాల్లో చాలాచాలా క్లిష్టమన్నారు.