Robot Reliance | రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్య విస్తరణ కొనసాగిస్తున్నారు. తాజాగా ఇండియన్ రోబోటిక్స్ స్టార్టప్ ఆడ్వెర్బ్ టెక్నాలజీస్లో మెజారిటీ వాటాను 132 మిలియన్ల డాలర్లను కొనుగోలు చేశారు. ఇప్పటికే ఈ-కామర్స్ నుంచి నూతన తరం ఇంధన రంగ వరకు విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ-కామర్స్ గోదాములు, ఇంధన ఉత్పత్తిని సమర్ధవంతంగా చేయడంలో రోబోటిక్ టెక్నాలజీ కీలకంగా వ్యవహరిస్తుందని ఆడ్వెర్బ్ టెక్నాలజీస్ సీఈవో-సహ వ్యవస్థాపకుడు సంగీత్ కుమార్ మంగళవారం చెప్పారు.
భారత్లో ఈ-కామర్స్ మార్కెట్పై పట్టు సాధించేందుకు గ్లోబల్ ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ చేస్తున్న ప్రయత్నాలకు పోటీగా ముకేశ్ అంబానీ వడివడిగా ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే ఆన్లైన్ గ్రాసరీ బిజినెస్ జియోమార్ట్, ఫ్యాషన్ రిటైలర్ అజియో, ఇంటర్నెట్ ఫార్మసీ నెట్మెడ్స్తోపాటు రిలయన్స్లోని వివిధ భాగాల్లో డజన్ల కొద్దీ వేర్ హౌస్ల (గోదాం) నిర్మాణం ఆడ్వెర్బ్ చేపట్టింది. వీటిల్లో రోబోటిక్ కన్వేయర్లు, సెమీ ఆటోమేటెడ్ సిస్టమ్స్, పిక్బై వాయిస్ సాఫ్ట్వేర్ ప్రవేశపెడుతుంది ఆడ్వెర్బ్ టెక్నాలజీస్.
రిలయన్స్ తన డిజిటల్ వేర్హౌస్లన్నింటిలోనూ ఆటోమేషన్ అమలు చేయడానికి భారీ ప్రణాళికలు రూపొందించిందని సంగీత్ కుమార్ తెలిపారు. వచ్చే రెండేండ్లలో వందల కేంద్రాల్లో వేర్హౌస్ల విస్తరణకు ప్రణాళికలు రూపొందించిందన్నారు. వీటిని ఏర్పాటు చేయడంలో రోబోటిక్ సిస్టమ్స్ శక్తిమంతంగా పని చేస్తాయన్నారు. గుజరాత్లోని జామ్నగర్లో గల రిలయన్స్ రిఫైనరీలో ఆటోమేషన్ డిజైన్ చేసింది ఆడ్వెర్బ్.. రిలయన్స్ ఆయిల్, గ్యాస్ స్టోరేజీ ఫెసిలిటీస్లో ఆడ్వెర్బ్ రోబోస్ హెల్ప్ చేస్తాయి.
ఐదేండ్ల వయస్సు గల ఆడ్వెర్బ్.. నోయిడా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. సాఫ్ట్వేర్ డిజైన్చేసి తయారు చేస్తుంది. రోబోటిక్స్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేస్తుంది. సాఫ్ట్వేర్ నుంచి హార్డ్వేర్ వరకు రోబోటిక్స్లో ప్రతి అంశాన్ని కవర్ చేస్తూ పని చేస్తున్న పరిమిత కంపెనీల్లో ఆడ్వెర్బ్ ఒకటిగా నిలుస్తుంది. తదుపరి తరం 5జీ రోబోటిక్స్ అండ్ బ్యాటరీ సిస్టమ్స్ నిర్మాణానికి ఆడ్వెర్బ్, రిలయన్స్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి.