దేశంలో 1,007 మంది అపర కుబేరులు
వరుసగా పదోసారి ముకేశ్ అంబానీదే ఆధిపత్యం
తర్వాతి స్థానంలోకి దూసుకొచ్చిన గౌతమ్ అదానీ
రోజుకు వెయ్యి కోట్లకుపైగా పెరిగిన సంపద
టాప్-100లో నలుగురు తెలుగువారు
ముంబై, సెప్టెంబర్ 30: అటు సంపద.. ఇటు సంపన్నుల సృష్టిలో భారత్ దూసుకుపోతున్నది. దేశంలోని మొత్తం 119 నగరాల్లో 1,007 మంది అపర కుబేరులున్నట్లు ఈ ఏడాదికిగాను గురువారం విడుదలైన 10వ ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్-2021 స్పష్టం చేసింది. అంతా వెయ్యి కోట్ల రూపాయలకుపైగా సంపద కలిగినవారే. రాజ్కోట్, సూరత్, ఆగ్రా, లుధియానా, ఫరీదాబాద్ నగరాల నుంచీ ఈసారి బిలియనీర్లు వచ్చారు. ఇలా ఈ ఏడాది మొత్తం కొత్తగా 179 మంది పెరుగగా, సంపదలో 51 శాతం వృద్ధి కనిపించింది. కరోనా విజృంభణలోనూ ఈ ఏడాది భారతీయ బిలియనీర్ల సంపద సగటున 25 శాతం ఎగబాకడం విశేషం. అయితే వరుసగా పదోసారి కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆధిపత్యమే కొనసాగింది. రూ.7,18,000 కోట్ల సంపదతో ముకేశ్, ఆయన కుటుంబం అగ్రస్థానంలో నిలిచింది. అయితే అదానీ గ్రూప్ సంస్థల అధిపతి గౌతమ్ అదానీ దూకుడు.. ముకేశ్ జోరుకు త్వరలోనే పగ్గాలు వేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏడాది కాలంలో ఏకంగా అదానీ సంపద రూ.3,65,700 కోట్లు ఎగబాకింది. రోజుకు రూ.1,002 కోట్లు ఎగిసినట్లు హురున్ వెల్లడించింది. ఇదే సమయంలో ముకేశ్ సంపద వృద్ధి రూ.163 కోట్లుగానే ఉండటం గమనార్హం. గతేడాది రూ.1,40,200 కోట్లుగానే అదానీ సంపద ఉన్నది. దీంతో ఈసారి ఆసియాలోనే రెండో అపర కుబేరుడిగా ఎదిగారు. ఇక టాప్-10లో నలుగురు కొత్తవారుండగా, మొత్తం జాబితాలో 229 మంది ఉన్నారు. 1,007 అపర కుబేరుల్లో 894 మంది సంపద స్థిరంగా ఉండటమో లేదా పెరుగడమో జరిగింది. 113 మంది సంపద తరిగిపోగా, 51 మంది ఈసారి చోటును కోల్పోయారు. సెప్టెంబర్ 15దాకా ఉన్న సంపద విలువను హురున్ పరిగణనలోకి తీసుకున్నది.
ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా ధనవంతుల జాబితా2021 జాబితాలో తెలంగాణ
రాష్ట్రంలో 63 మంది బిలియనీర్లు
గతేడాదితో పోల్చితే పెరిగిన 8 మంది
సంఖ్యాపరంగా దేశంలోనే 6వ స్థానం
హైదరాబాద్లో 56 మంది బిలియనీర్లు
నిరుడుతో చూస్తే ఐదుగురు ఎక్కువ
‘మేము ఈ జాబితాను 2011 నుంచి ప్రకటిస్తున్నాం. నాడు 100 మందితో విడుదల చేస్తే, ఈ పదేండ్లలో 1,007 మందికి చేరింది. రాబోయే ఐదేండ్లకుపైగా కాలంలో 3,000 మందికి పెరుగవచ్చని భావిస్తున్నాం. వీరిలో మరో 250 మంది డాలర్ బిలియనీర్లు ఉండొచ్చు’
-అనస్ రహ్మాన్ జునైద్, హురున్ ఇండియా ఎండీ