హైదరాబాద్, మార్చి 15: దేశంలో ఆరో అతిపెద్ద ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ యెస్ బ్యాంక్.. తెలంగాణ మార్కెట్పై ప్రత్యేక దృష్టి సారించింది. దక్షిణాదిలో వ్యూహాత్మక వ్యాపర విస్తరణలో భాగంగా తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈ సంస్థలకు అధికంగా రుణాలు ఇవ్వనున్నట్లు యెస్ బ్యాంక్ ఎండీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేయబోతున్న శాఖల్లో ఎంఎస్ఎంఈలకు రుణాలు అందించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు, ముఖ్యంగా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నిధులు లేక సతమతమవుతున్న చిన్న, సూక్ష్మ స్థాయి సంస్థలను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో వీరికి రుణాలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్లో బ్యాంక్ 25 శాఖలు నిర్వహిస్తుండగా, త్వరలో మరో నాలుగు శాఖలను ప్రారంభించాలనుకుంటున్నట్లు చెప్పారు.