Moody’s | దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడిలో పెడుతుందని ప్రముఖ రేటింగ్స్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ అంచనా వేసింది. నిరంతరాయ వ్యాక్సినేషన్ పురోగతితో భారత ఆర్థిక కార్యకలాపాలు రికవరీ సాధిస్తాయని గురువారం పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 9.3 శాతం, 2022-23లో 7.9 శాతానికి పరిమితం అవుతుందని నిర్ధారించింది.
కరోనా ఆంక్షలు సడలించడంతో వినియోగదారుల డిమాండ్, వ్యయం, మాన్యుఫాక్చరింగ్ యాక్టివిటీ రికవరీ దిశగా అడుగులేస్తున్నాయి. హై కమొడిటీ ధరలతో వచ్చే 12-18 నెలల్లో ప్రముఖ కంపెనీలు గణనీయ ప్రగతి నమోదు చేస్తాయని మూడీస్ అనలిస్ట్ శ్వేత పటోడియా చెప్పారు. ఆర్థిక వ్యవస్థ సుస్థిర రికవరీతో భారత్ రుణ పరపతి మూలాలు దేశీయ కంపెనీలకు అనుకూలంగా ఉన్నాయని మూడీస్ తెలిపింది.
వ్యాక్సినేషన్ రేట్ పెరుగుతున్నా కొద్దీ వినియోగదారుల్లో విశ్వాసం స్థిరీకరణ సాధిస్తుందని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం అమలులో ఉన్న తక్కువ వడ్డీరేట్లతో నిధుల ఖర్చు తగ్గడంతోపాటు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా న్యూ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కు మద్దతుగా నిలుస్తుందని మూడీస్ వివరించింది. అయితే ప్రభుత్వ వ్యయంలో జాప్యం, ఇంధన కొరతతో పారిశ్రామిక ఉత్పత్తి తగ్గుదలకు, తక్కువ కమొడిటీ ధరలతో కంపెనీల లాభాలు తగ్గుముకం పడతాయన్నారు.