న్యూఢిల్లీ, ఆగస్టు 31: విదేశీ మదుపర్లను మరింతగా ఆకట్టుకోవడానికి రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)కు సంబంధించి ఉన్న నిబంధనలను ఇంకా సరళతరం చేయాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ యోచిస్తున్నది. ఈ మేరకు ఓ ఉన్నతాధికారి సోమవారం తెలిపారు. ఈ అంశంపై పారిశ్రామిక, అంతర్గత వాణిజ్యంపై ప్రోత్సాహక శాఖ భాగస్వాములతో సంప్రదింపులు కూడా జరుపుతున్నదని సమాచారం. ఈ క్రమంలోనే ‘కొన్ని నిబంధనలను సడలించే విషయాన్ని పరిశీలిస్తున్నారు’ అని సదరు ఉన్నతాధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ రక్షణ రంగంలోకి ఆటోమేటిక్ మార్గం ద్వారా 74 శాతం వరకే ఎఫ్డీఐకి అనుమతి ఉన్నది.
ఇంతకుమించి పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తప్పనిసరి. అలాగే ఇప్పుడున్న విధానం ప్రకారం రక్షణ రంగంలో పెట్టుబడులు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ భద్రతాపరమైన అంగీకారానికి, రక్షణ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు లోబడి ఉంటాయి. కాగా, 2000 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు దేశంలోని రక్షణ పరిశ్రమల్లో ఎఫ్డీఐ 32.29 మిలియన్ డాలర్లుగా ఉన్నది.
ఇక 2025-26లో రక్షణ ఎగుమతుల్లో ప్రైవేట్ రంగం వాటా రూ.17,353 కోట్లు లేదా 45.16 శాతంగా ఉన్నది. ప్రభుత్వ రక్షణ రంగ సంస్థల వాటా రూ.21,071 కోట్లు లేదా 54.84 శాతంగా ఉన్నది. అయితే దేశ రక్షణ రంగం అత్యంత సున్నితమైనది కావడంతో ఇందులో ఎఫ్డీఐలకు పెద్దపీట వేయడం అంతగా శ్రేయస్కరం కాదన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయిప్పుడు. ప్రభుత్వ సహకారంతో స్థానిక సంస్థలకే భాగస్వామ్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.