న్యూఢిల్లీ, డిసెంబర్ 13: అమెరికా ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) తయారీ దిగ్గజం టెస్లాకు మోదీ సర్కారు షాకిచ్చింది. దేశంలోకి దిగుమతయ్యే విద్యుత్తు ఆధారిత వాహనాలపై సుంకాలు తగ్గబోవని, వాటికి రాయితీలిచ్చే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని బుధవారం స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రశ్నకుగాను లోక్సభలో లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోం ప్రకాశ్ తెలిపారు. తాము కోరుకున్నవిధంగా ప్రోత్సాహకాలిస్తే భారతీయ మార్కెట్లోకి వస్తామని, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతామని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చెప్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టెస్లా, ఇతర బహుళజాతి ఆటో సంస్థల కోసం విదేశాల నుంచి భారత్కు దిగుమతయ్యే వాహనాలు, వాటికి సంబంధించిన హెవీ బ్యాటరీలు, సెమీ కండక్టర్స్, మ్యాగ్నటిక్ పార్ట్స్ తదితర విడిభాగాలపై సుంకాల తగ్గింపు, ఇతరత్రా రాయితీలను ప్రభుత్వం ఏమైనా ఇస్తున్నదా? అని అడిగిన ప్రశ్నకు మంత్రి పైవిధంగా బదులిచ్చారు. ‘ప్రస్తుతం దేశంలోకి దిగుమతి అవుతున్న ఎలక్ట్రిక్ వెహికిల్స్పై వేస్తున్న దిగుమతి సుంకంపై సబ్సిడీనో లేక స్థానికంగా కారు విలువను పెంచే వాటి నుంచి మినహాయింపో ఇచ్చే ప్రతిపాదనేదీ లేదు’ అన్నారు.
అయితే భారత్లో దేశ, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ‘మేక్ ఇన్ ఇండియా’ సహా అనేక చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే ఆటోమొబైల్, ఆటో విడిభాగాల తయారీ పరిశ్రమ కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించామని గుర్తుచేశారు. దేశంలో వాహన తయారీని ప్రోత్సహించేందుకు, ఇతరత్రా అడ్వాన్స్డ్ ఆటోమోటివ్ టెక్నాలజీల కోసం, ఈవీలు, వాటి విడిభాగాల ఉత్పత్తిని పెంచేలా రూ.25,938 కోట్లను బడ్జెట్లో కేటాయించినట్టూ చెప్పారు. కాగా, ప్రస్తుతం విదేశాల్లో పూర్తిగా తయారైన కార్లను భారత్లోకి తీసుకురావాలంటే ఆ కారుపై 60 శాతం నుంచి 100 శాతం వరకు కస్టమ్స్ డ్యూటీ పడుతున్నది. వాహనం విలువ, దాని ఇంజిన్ పరిమాణం, బీమా, రవాణా ఖర్చుల ఆధారంగా ఈ దిగుమతి సుంకం ఉంటుంది. ఈ ఏడాది జూన్లో అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీని మస్క్ కలిసిన విషయం తెలిసిందే. భారత్లో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్న మస్క్.. వచ్చే ఏడాది ఇక్కడికి వస్తానన్న సంగతీ విదితమే. ఇక గత నెల వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ సైతం క్యాలిఫోర్నియాలోని టెస్లా ప్లాంట్ను సందర్శించారు. ఈ నేపథ్యంలో తాజా ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకున్నది.