లోగోను ఆవిష్కరించిన కేటీఆర్
హైదరాబాద్ , ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): వినూత్న ఆవిష్కరణల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నదని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. నీటి పారిశుద్ధ్యం, పరిశుభ్రత, ఆవిష్కరణల కేంద్రాన్ని (వాటర్ శానిటేషన్ హైజిన్ ఇన్నోవేషన్ హబ్-వాష్) ఏర్పాటుచేయడం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మరో వినూత్న కార్యక్రమమని పేర్కొన్నారు. మే 5, 6 తేదీల్లో జరిగే ఇంక్ వాష్ 3.0 లోగోను మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్లో సోమవారం ఆవిష్కరించారు. ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో ఇంక్ వాష్ కార్యక్రమాన్ని మున్సిపల్శాఖ, ఆస్కి భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నట్టు నిర్వహకులు తెలిపారు. ఇంక్ వాష్ 3.0లో 100కు పైగా సరికొత్త ఆవిష్కరణలను ప్రదర్శించనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్, ఆస్కి ప్రతినిధులు శ్రీనివాసచారి, మాలినిరెడ్డి పాల్గొన్నారు.