హైదరాబాద్, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని మరింత పరుగులు పెట్టించేలా, పెట్టుబడిదారులకు పూర్తిస్థాయిలో భరోసా కల్పించేలా, ఇతర రాష్ట్రాలకు రోల్ మాడల్గా నిలిచేలా అందరితో చర్చించి త్వరలో కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. అంతేకాకుండా తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో త్వరలోనే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’కు శ్రీకారం చుట్టబోతున్నట్లు ఆయన ప్రకటించారు.
మంగళవారం జూబ్లీహిల్స్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ‘ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్టీసీసీఐ)’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్రోత్ ఎక్స్ 2026’ సదస్సులో మంత్రి మాట్లాడుతూ.. వృద్ధి అంటే యాదృచ్ఛికంగా వచ్చేది కాదని, భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని శాస్త్రీయంగా, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడం ద్వారా సాధ్యమవుతుందన్నారు. ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ విజన్ 2047’ ను రూపొందించిందన్నారు.
ఏఐ, ఇండస్ట్రీ 5.0 లాంటి టెక్నాలజీలతో వర్ కల్చర్లో మార్పు వచ్చిందని, రాబోయే రోజుల్లో కంపెనీల కంటే ‘ఎకో సిస్టం’కే ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, ప్రముఖ వైద్యులు డా నాగేశ్వర్ రెడ్డి, ఎఫ్టీసీసీఐ ప్రెసిడెంట్ ఆర్ రవి కుమార్, సై రూట్ ఏరో స్పేస్ ప్రతినిధి పవన్, గ్రోత్ ఎక్స్ 2026 కన్వీనర్ పంకజ్ దివాన్ తదితరులు పాల్గొన్నారు.