ఈ ఏడాది భారత్లోని అల్ట్రా-హై నెట్ వర్త్ ఇండివీడ్యువల్స్ల్లో 90 శాతం మంది సంపద మరింతగా పెరిగే అవకాశాలే ఉన్నాయి. 63 శాతం మంది సంపదైతే 10 శాతానికిపైగా పెరుగవచ్చని అంచనా. లగ్జరీ ఐటెమ్స్పై పెట్టుబడులతో ఎక్కువ మొత్తంలో రాబడిని గడిస్తున్నారు.
-శిశిర్ బైజాల్ నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ
India | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: దేశంలో అపర కుబేరులు గత ఏడాది 6 శాతం పెరిగారు. 2023లో భారత్లో 13,263 మంది అల్ట్రా-హై నెట్ వర్త్ ఇండివీడ్యువల్స్ (యూహెచ్ఎన్డబ్ల్యూఐ) ఉన్నట్టు తాజా నివేదికలో ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ తెలిపింది. 30 మిలియన్ డాలర్లు, ఆపై సంపద ఉన్నవారితో ఈ లెక్కను తేల్చింది. ‘ది వెల్త్ రిపోర్ట్ 2024’ పేరిట బుధవారం నైట్ ఫ్రాంక్ ఇండియా ఓ నివేదికను విడుదల చేసింది. నిరుడు దేశంలోని అపర కుబేరుల సంఖ్య 768 పెరిగిందని, 2022లో 12,495 మందే ఉన్నారని ఇందులో వెల్లడించింది. దీంతో 6.1 శాతం వృద్ధి నమోదైనట్టు పేర్కొన్నది.
2028కల్లా 20వేలకు..
మరో నాలుగైదేండ్లలో భారతీయ అపర కుబేరుల సంఖ్య ఇంకా పెరుగుతుందని, దాదాపు 20వేలకు చేరవచ్చన్న అభిప్రాయాన్ని ఈ సందర్భంగా వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నైట్ ఫ్రాంక్ వ్యక్తం చేసింది. 2028కల్లా దేశంలో అల్ట్రా-హై నెట్ వర్త్ ఇండివీడ్యువల్స్ 19,908 మంది ఉండొచ్చని అంచనా వేసింది. ప్రస్తుత సంఖ్యతో పోల్చితే సుమారు 7వేల మంది పెరుగవచ్చని చెప్తున్నది.
లగ్జరీ ఉత్పత్తులపైనే ఆసక్తి
దేశంలోని అపర కుబేరులు తమ పెట్టుబడి పెట్టగలిగిన సంపదలో 17 శాతం లగ్జరీ ఉత్పత్తులకే కేటాయిస్తున్నారు. భారతీయ సంపన్నుల్లో అత్యధిక మంది వాచీలకు మొదటి ప్రాధాన్యతనిస్తున్నట్టు తాజా నివేదికలో నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ఆ తర్వాత ఆర్ట్స్, ఆభరణాలపై పెట్టుబడులకు ఇష్టపడుతున్నారు. క్లాసిక్ కార్లు నాల్గో స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో లగ్జరీ హ్యాండ్ బ్యాగులు, వైన్, అరుదైన విస్కీ, ఫర్నీచర్, రంగు వజ్రాలు, నాణేలున్నాయి. ఇక అంతర్జాతీయంగా చూస్తే ఎక్కువమంది అల్ట్రా-హై నెట్ వర్త్ ఇండివీడ్యువల్స్ లగ్జరీ వాచీలు, క్లాసిక్ కార్లపై ఇన్వెస్ట్ చేసేందుకు మక్కువ ప్రదర్శిస్తున్నట్టు తేలింది.
హౌజింగ్ ప్రాపర్టీస్పై..
భారతీయ సంపన్నులు తమ సంపదలో 32 శాతం.. దేశ, విదేశాల్లోని నివాస గృహాలకే పెడుతున్నారని నైట్ ఫ్రాంక్ ఇండియా ఈ సందర్భంగా రిపోర్టులో పేర్కొన్నది. దేశంలోని అల్ట్రా-హై నెట్ వర్త్ ఇండివీడ్యువల్స్ సగటున సుమారు మూడిండ్లు కలిగి ఉన్నారని.. రెండోది, ఆపై ఇండ్లకు ఆకర్షణీయ స్థాయిలో అద్దెలను అందుకుంటున్నారని వెల్లడించింది. ఇక ఈ ఏడాది సుమారు 12 శాతం అపర కుబేరులు కొత్త ఇంటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు కూడా చెప్పింది. గత ఏడాది కూడా ఇంతే స్థాయిలో అపర కుబేరులు తమ నూతన గృహాలను కొన్నారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఈ ఏడాది 24 శాతం అల్ట్రా-హై నెట్ వర్త్ ఇండివీడ్యువల్స్ ఇండ్లను కొంటారని అంచనా.