న్యూఢిల్లీ, జూలై 21: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా.. అత్యంత ఆకర్షణీయ భారతీయ సంస్థగా నిలిచింది. ఈ ఏడాదికిగాను రాండ్స్టడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రిసెర్చ్ చేపట్టిన సర్వేలో అత్యధిక ఉద్యోగులు మైక్రోసాఫ్ట్పైనే మక్కువ కనబరిచారు. మెర్సిడెస్ బెంజ్ ఇండియా రెండో స్థానంలో, అమెజాన్ ఇండియా మూడో స్థానంలో ఉన్నట్టు గురువారం విడుదల చేసిన నివేదికలో రాండ్స్టడ్ స్పష్టం చేసింది. సర్వే ప్రకారం.. ఆర్థికంగా, కీర్తి-ప్రతిష్ఠల్లో, జీతభత్యాల్లో మైక్రోసాఫ్టే మేటి. ఈ టాప్-3 ఎంప్లాయీ వాల్యూ ప్రపోజిషన్ సూచికల్లో సంస్థకే అత్యధిక స్కోర్ వచ్చింది. ఈ జనవరి-మార్చి మధ్య ప్రపంచవ్యాప్తంగా 31 దేశాల్లో సాగిన ఈ సర్వేలో 5,944 సంస్థల్లోని 18-65 ఏండ్ల వయసున్న 1.63 లక్షల మందికిపైగా అభిప్రాయాలను సేకరించారు.