న్యూఢిల్లీ, జనవరి 11: మెటావర్స్దే భవిష్యత్తు అని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. అందుకే మైక్రోసాఫ్ట్ సైతం దీనిపై దృష్టి సారించిందని చెప్పారు. ఇప్పటికే మెటావర్స్ తీరుతెన్నులను జాగ్రత్తగా గమనిస్తున్నామని నాదెళ్ల తెలియజేశారు. మంగళవారం వర్చువల్గా జరిగిన మైక్రోసాఫ్ట్ వార్షిక ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ‘ఫ్యూచర్రెడీ’లో నాదెళ్ల మాట్లాడుతూ.. ‘ఎన్నో ఏండ్లుగా మాకో డిజిటల్ ప్రతినిధిని సృష్టించుకోవడంపై మేము మాట్లాడుతున్నాం. దాని సాకారానికి మెటావర్స్ రూపంలో ఇప్పుడో అవకాశం వచ్చింది’ అన్నారు. కాగా, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్.. మెటాగా పేరు మార్చుకున్న విషయం తెలిసిందే. మెటావర్స్ నిర్మాణానికి ఏకంగా 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులనూ పెడుతున్నది. ఈ క్రమంలోనే టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా మెటావర్స్ ప్రయోజనాన్ని అటు వినియోగదారులు, ఇటు సంస్థలు అందిపుచ్చుకునేలా చర్యలకు దిగుతున్నది. నిజానికి గతేడాది నవంబర్లో జరిగిన సంస్థ కార్యక్రమంలోనే మైక్రోసాఫ్ట్.. తమ బృందాల కోసం ‘మెష్’ అనే వీడియో కాన్ఫరెన్సింగ్ వేదికను ప్రారంభిస్తామని ప్రకటించింది. ఇదీ మెటావర్స్లో భాగమే. ‘ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా భౌతికంగా కలుసుకోవడం సాధ్యపడటం లేదు. వీడియో కాన్ఫరెన్స్లకు ప్రాధాన్యం పెరిగిపోయింది. మెటావర్స్తో ఇప్పుడున్న టెక్నాలజీ మరో స్థాయికి వెళ్లగలదు’ అని నాదెళ్ల ఈ సందర్భంగా అన్నారు. ఇదిలావుంటే టెక్నాలజీ పెరిగినకొద్దీ వ్యాపార సంస్థల ఉత్పాదకతను మెరుగుపర్చుకోవచ్చని, ఆయా ఉత్పత్తులను సరసమైన ధరలకే మార్కెట్లోకి తీసుకురావచ్చనీ అభిప్రాయపడ్డారు. కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్థలు డిజిటలైజ్ అవుతున్నాయన్నారు.
వాడుక భాషలో చెప్పాలంటే.. డిజిటల్ అవతారాల్లో ప్రపంచాన్ని చుట్టివచ్చే అవకాశాన్ని ప్రజలకు కల్పించేదే ఈ మెటావర్స్. కరోనా నేపథ్యంలో అంతా డిజిటలైజేషన్.. అన్నీ ఆన్లైనే అయిపోయాయి. దీంతో ఉన్నచోటనే ఉంటూ సర్వం చక్కబెట్టుకునే వీలు మెటావర్స్తో మరింత సులభం అవుతుంది. ఇక టెక్నాలజీ పరిభాషలో చెప్పాలంటే.. ఆగ్మెంటెడ్ రియాల్టీ (ఏఆర్), వర్చువల్ రియాల్టీ (వీఆర్), బ్లాక్చైన్లతో కూడిన అనుకరణ అనుభవమే మెటావర్స్. వాస్తవిక ప్రపంచం, సాంకేతిక విప్లవంతో జనించే ఊహా ప్రపంచం కలయికగానూ దీన్ని అభివర్ణిస్తున్నారు.
దీర్ఘకాలంలో దేశ వృద్ధిరేటును కరోనా వైరస్ ప్రభావితం చేయబోదని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. అయితే వృద్ధిరేటు నెమ్మదించే వీలుందన్నారు. అయినప్పటికీ ఈ దశాబ్దంలో ప్రపంచ దేశాల వృద్ధిరేట్ల కంటే భారత వృద్ధిరేటే ఆకర్షణీయంగా ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాల్లో డిజిటలైజేషన్ పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. చిప్ డిజైన్, ఎలక్ట్రానిక్స్ తయారీ సేవల వంటి కొత్త అవకాశాలను భారత్ అందిపుచ్చుకోగలదని కేంద్ర ఐటీ శాఖ మంత్రి ఆర్ చంద్రశేఖర్ అన్నారు.
దేశంలో ప్రతిభకు కొరత ఉన్నదని, ఇప్పుడు భారత ఐటీ పరిశ్రమ ముందున్న అతిపెద్ద సవాల్ ఇదేనని విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీ అన్నారు. డిమాండ్కు తగ్గట్టుగా టాలెంటున్న ఉద్యోగులు దొరకడం లేదని ఈ సందర్భంగా తెలిపారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సంస్థల మధ్య ప్రతిభావంతుల అన్వేషణ కోసం యుద్ధం జరుగుతున్నదని వ్యాఖ్యానించారు. ఉద్యోగులు కేవలం మెరుగైన జీతాలు, అవకాశాల కోసమే కంపెనీలు మారిపోరని, సంస్థతో వారు అనుసంధానం కాలేకపోతుండటమే ప్రధాన కారణమని చెప్పారు.