హైదరాబాద్, జూలై 1: దేశంలో ఫిజికల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను విస్తృత స్థాయిలో అమలుపర్చడానికి మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్), అబుదాబీ కేంద్రంగా నడుస్తున్న గ్లోబల్ టెక్నాలజీ సంస్థ అనలాగ్ బుధవారం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. మౌలిక సదుపాయాల కల్పన, రవాణా, పారిశ్రామిక, పట్టణాభివృద్ధి, మేధో ఆధారిత కార్యకలాపాల నిర్వహణ తదితర కీలక రంగాల్లో ఇరు సంస్థలు ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాలను అందించనున్నాయి.
ఈ క్రమంలోనే రాబోయే 3-4 ఏండ్లలో 300-500 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టబోతున్నాయి. ఈ సందర్భంగా ఎంఈఐఎల్ ఎండీ పీవీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాలే అభివృద్ధికి పునాది అన్నారు. భారత్కు ఫిజికల్ ఇంటెలిజెన్స్ను తీసుకురావడంలో అనలాగ్తో కలిసి పనిచేయడం గర్వకారణమన్నారు. అనలాగ్ వ్యవస్థాపక సీఈవో అలెక్స్ కిప్మన్ మాట్లాడుతూ.. భారతీయ ఇంజినీరింగ్ ప్రతిభ అసాధారణమని కొనియాడారు.
దేశీయంగా తమకు మేఘా సరైన భాగస్వామి అన్నారు. ఈ క్రమంలోనే ఈ ఒప్పందాన్ని భారత్-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్య సాంకేతిక రంగ సహకారాన్ని మరింత బలోపేతం చేసే కీలక అడుగుగా ఇరు సంస్థలు అభివర్ణించాయి. తమ ఈ భాగస్వామ్యంతో స్మార్ట్ మొబిలిటీ, రోబోటిక్స్, ప్రజా భద్రత, ఏఐ ఆధారిత సేవల్లో వేగం పుంజుకోగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాయి. అధునాతన సాంకేతిక పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ మారాయని కంపెనీలు ప్రశంసించాయి. ఈ కార్యక్రమంలో ఎంఈఐఎల్ డైరెక్టర్లు పీవీ ప్రణప్ రెడ్డి, మానస్ రెడ్డి, అనలాగ్ సీవోవో స్మిత్ తదితరులు పాల్గొన్నారు.