హైదరాబాద్, సెప్టెంబర్ 29: మంగోలియాలో అత్యాధునిక క్రూడాయిల్ రిఫైనరీని మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(మెయిల్) నిర్మించనున్నది. ఈ ప్రాజెక్టు విలువ 648 మిలియన్ డాలర్లు(రూ.5,400 కోట్లకు పైమాటే). ఇటీవల మంగోల్ రిఫైనరీ సంస్థ నుంచి కంపెనీ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ను కూడా అందుకున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి మంగోలియా రాజధాని ఉలాన్బాతర్లో ఇరు సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
చమురు వెలికితీత, రవాణా, శుద్ది రంగాల్లో ఇప్పటికే సేవలు అందించడంతోపాటు ఆన్షోర్, ఆఫ్షోర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మెఘా..ఇప్పటికే అక్కడ 598 మిలియన్ డాలర్లతో గ్రీన్ ఫిల్డ్ ఆయిల్ రిఫైనరీ క్షేత్రాన్ని నిర్మిస్తున్నది కూడా. అలాగే 189 మిలియన్ డాలర్లతో క్యాప్టివ్ పవర్ ప్లాంట్ను సైతం కూడా నిర్మిస్తున్నది. ఈ మూడు ప్రాజెక్టులు కలుపుకొని మంగోలియాలో మెఘా 1.436 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడి పెడుతున్నది.
ఈ సందర్భంగా మెఘా ఎండీ పీవీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ..భారత్-మంగోలియా దేశాల మధ్య ఉన్న సత్సంబంధాలకు తాము చేపట్టిన రిఫైనరీ పనులు ఒక ఉదాహరణని, తొలి గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ నిర్మాణంలో భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఉందన్నారు. నిర్దేశిత కాల వ్యవధిలో తాము ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని స్పష్టంచేశారు.