న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: అత్యధిక ఫ్రీక్వెన్సీ స్థాయిలో మూడు కొత్త స్పెక్ట్రమ్ బ్యాండ్ల వేలానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం కాబోతున్నది. ఈ మేరకు ఇటీవలే టెలికం రంగ రెగ్యులేటర్ ట్రాయ్.. భాగస్వాముల అభిప్రాయాలను కోరింది. ఇప్పటిదాకా 37-37.5 గిగాహెట్జ్, 37.5-40 గిగాహెట్జ్, 42.5-43.5 గిగాహెట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో స్పెక్ట్రమ్ను వేలం వేయలేదు. దీంతో వీటి ధర, పరిమాణం, చెల్లింపు విధానాలు, చెల్లుబాటు కాలం, కేటాయింపులకు సంబంధించిన నిబంధనలు తదితర అంశాలపై టెలికం సంస్థలతో ట్రాయ్ సంప్రదింపులు చేస్తున్నదని ఓ అధికారిక ప్రకటన విడుదలైంది. అంతా కుదిరితే ఈ కొత్త బ్యాండ్లలో ఏకంగా 4,000 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ వేలానికి వస్తుంది. భవిష్యత్తులో 5జీ, 6జీ మొబైల్ సర్వీసుల కోసం ఇది అందుబాటులో ఉంటుంది. 37-37.5 గిగాహెట్జ్ బ్యాండ్లోని రేడియో తరంగాలు మొబైల్ ఫోన్ సేవల కోసమే ఉంటుండగా, 37.5-40 గిగాహెట్జ్, 42.5-43.5 గిగాహెట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలోని స్పెక్ట్రమ్.. మొబైల్ సర్వీసులతోపాటు, శాటిలైట్ గేట్వే లింక్స్కూ వాడనున్నారు.
66-71 గిగాహెట్జ్
ఇక అత్యంత ఫ్రీక్వెన్సీ కలిగిన 66-71 గిగాహెట్జ్ బ్యాండ్లోని స్పెక్ట్రమ్నూ వేలం వేయాలని టెలికం శాఖ కమిటీ చర్చించినట్టు తెలుస్తున్నది. అయితే టెలికం సర్వీసులతోపాటు స్పేస్ అవసరాలకు ఇప్పటికైతే దీని అవసరం లేదన్న నిర్ణయానికి వచ్చిన కమిటీ.. దాని అమ్మకానికి సిఫార్సు చేయలేదని అంటున్నారు. మరోవైపు 37-37.5 గిగాహెట్జ్, 37.5-40 గిగాహెట్జ్, 42.5-43.5 గిగాహెట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో స్పెక్ట్రమ్ వేలంపై మే 2కల్లా అభిప్రాయాలను తెలపాలని టెలికం సంస్థలను ట్రాయ్ కోరింది. మే 16కల్లా కౌంటర్-కామెంట్లకు వీలున్నది. కాగా, ఈ ఏడాది జూన్ 6న మొబైల్ ఫోన్ సేవల కోసం మొత్తం 8 స్పెక్ట్రమ్ శ్రేణుల్లో కేంద్ర ప్రభుత్వం రేడియో తరంగాలను వేలానికి పెడుతున్న విషయం తెలిసిందే. కనీస ధర దాదాపు రూ.96,317 కోట్లు. 800, 900, 1,800, 2,100, 2,300, 2,500, 3,300 మెగాహెట్జ్ బ్యాండ్లతోపాటు 26 గిగాహెట్జ్ బ్యాండ్లో ఈ వేలం ఉంటుంది. ఇదిలావుంటే ఈసారి గెలిచిన బిడ్డర్లు 20 ఏండ్లపాటు స్పెక్ట్రమ్ను వినియోగించుకోవచ్చు. అంతేగాక ఇందుకు సంబంధించి 20 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేసుకోవచ్చు. ఒకవేళ 10 ఏండ్లు దాటిన తర్వాత స్పెక్ట్రమ్ వద్దనుకుంటే దాన్ని సరెండర్ చేసే వెసులుబాటునూ టెలికం శాఖ బిడ్డర్లకు కల్పిస్తుండటం విశేషం.