అహ్మదాబాద్ నుంచి నమస్తేతెలంగాణ ప్రతినిధి: మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రిగ్గుల్ని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ)కు సరఫరా చేయడం ప్రారంభించింది. తొలి రిగ్గు విజయవంతంగా తన డ్రిల్లింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తుండగా, అతి త్వరలోనే మరో రిగ్గు సరఫరాకు సిద్ధంగా ఉంది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దేశీయంగా అత్యాధునిక రిగ్లను తయారు చేస్తున్నట్లు మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ తెలిపింది. ఓఎన్జీసీ నుంచి 47 రిగ్గుల సరఫరా కోసం తమకు 860 మిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్ట్ 2019లో లభించిందని, మొదటి రిగ్ ఇటీవల వారికి అందించామని మెఘా రిగ్స్ విభాగం డ్రిల్ మెక్ చైర్మన్ బొమ్మారెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఒఎన్జీసీకి సరఫరా చేయాల్సిన 47 రిగ్గులలో భాగంగా ప్రస్తుతానికి 14 రిగ్గులను వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు.మొత్తానికి ఈ ఆర్థిక సంవత్సరం చివరి కల్లా 23 రిగ్గులను ఓఎన్సీజీకి అందించనుంది.
2 బిలియన్ డాలర్ల ఆర్డర్ల అంచనా
గురువారం అహ్మదాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో మెఘా ఆయిల్ రిగ్స్ డివిజన్ అధిపతి హెడ్ ఎన్ కృష్ణకుమార్ మాట్లాడుతూ…ఈ స్వదేశీ రిగ్గులను భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక మేకిన్ ఇండియాలో భాగంగా తయారు చేసి ఓఎన్జీసీకి అనతికాలంలోనే అప్పగించడం గర్వకారణమన్నారు. ప్రస్తుతం 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు చేతిలో ఉన్నాయని, దేశీ, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చే మూడేళ్లలో 2 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు లభిస్తాయని అంచనావేస్తున్నామన్నారు. ఎంఈఐఎల్ వైఎస్ ప్రెసిడెంట్ పి.రాజేష్రెడ్డి మాట్లాడుతూ దేశంలో హైదరాబాద్, కాకినాడలలోని ఉత్పత్తి కేంద్రాలలో రిగ్గులను తయారు చేస్తున్నామన్నారు.అలాగే ఇటలీలోని మిలాన్ సమీపంలోనూ, అమెరికాలోని హూస్టన్, బెలారస్ ఉత్పత్తి ప్లాంట్లలో ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఇటలీకి చెందిన రిగ్స్ తయారీ సంస్థ డ్రిల్మెక్ను ఇదివరకే తమ సంస్థ టేకోవర్ చేసుకున్నట్లు, ప్రస్తుతం తమ సంస్థ ఆధ్వర్యంలో రిగ్స్ తయారు చేస్తున్నామని చెప్పారు.రిగ్ల తయారీ కోసం రెండు యూనిట్లపై 1.4 మిలియన్ డాలర్ల వరకూ పెట్టుబడి చేసినట్లు మెఘా సంస్థ ప్రతినిధులు చెప్పారు. మిడిల్ ఈస్ట్ రష్యా, మెక్సికో నుంచి ఆర్డర్లు ఉన్నట్లు తెలిపారు. త్వరలో ఆయా దేశాలకు కూడా సరఫరా చేస్తామన్నారు.
కేంద్ర సంస్థలకు బిడ్ చేస్తాం&
కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియలో కొన్ని కంపెనీలను దక్కించుకునేందుకు బిడ్డింగ్లో పాల్గొంటామని మెఘా ప్రతినిధులు తెలిపారు. షిప్పింగ్ కార్పొరేషన్ తదితర వాటిని దక్కించుకునేందకు ప్రయత్నిస్తున్నామన్నారు.