వాషింగ్టన్, మే 22: ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న సీఈవోల్లో భారత సంతతికి చెందిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఢిల్లీ ఎయిర్ఫోర్స్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న నికేశ్ అరోరా, ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక వేతనం అందుకుంటున్న రెండో సీఈవోగా నిలిచారు. సుందర్ పిచాయ్, మార్క్ జుకర్బర్గ్.. తదితరులు ఆయన తర్వాత ఉండటం గమనార్హం. 2023 ఏడాదికి సంబంధించి అత్యధిక వేతనాలు పొందుతున్న టాప్ సీఈవోల జాబితాను ‘ది వాల్స్ట్రీట్ జర్నల్’ తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం, ‘బ్రాడ్కామ్స్’ సీఈవో హాక్టాన్ (162 మిలియన్ డాలర్లు) తర్వాత నికేశ్ అరోరా రెండో స్థానంలో ఉన్నారని తెలిపింది. అమెరికాలో సైబర్ సెక్యూరిటీ కంపెనీ ‘పాలో ఆల్టో నెట్వర్క్స్’ సీఈవోగా నికేశ్ అరోరా 151.43 మిలియన్ డాలర్ల (రూ.1,261కోట్లు) వేతన ప్యాకేజీని అందుకుంటున్నారని పేర్కొన్నది. గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్గా నికేశ్ అరోరా తొలుత ఇండస్ట్రీలో తనదైన ముద్రవేశారు. 2014లో ఆ సంస్థను వీడి జపాన్లోని ప్రముఖ బ్యాంక్లో కీలక బాధ్యతలు చేపట్టారు. 2018లో ‘పాలో ఆల్టో నెట్వర్క్స్’ సీఈవోగా చేరారు.