Meesho : ఏ కంపెనీ అయినా ఉద్యోగులు రోజూ ఆఫీస్కు రావాలని ఆదేశిస్తుంది. కానీ, ఆన్లైన్ రిటైల్ స్టార్టప్ మీషో వెరైటీగా ఆలోచించింది. వారంలో ఒకరోజు ఆఫీసుకు రండి అంటూ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. వచ్చే ఏడాది జూన్ నుంచి వారంలో ఒక్కరోజే ఆఫీసుకు రండి. మిగతా రోజులు ఇంటి దగ్గర పని చేయండి అని చెప్పింది. మెజారిటీ ఉద్యోగుల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. కస్టమర్లను వ్యక్తిగతంగా కలిసి ప్రొడక్ట్ గురించి వివరించడం వల్ల మార్కెట్ పెరుగుతుందని చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు.
ఉద్యోగుల అభిప్రాయానికి విలువ ఇస్తూ మీషో గత ఏడాది ఎక్కడి నుంచైనా పని చేయొచ్చు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ‘ఉద్యోగుల ఫీడ్బ్యాక్ ఆధారంగా మార్పులు చేయడం అనేది మా కంపెనీ సిద్ధాంతం. పరిమితులు లేకుంటేనే ఉత్పాదక పెరుగుతుందనేది మేము నిర్వహించిన సర్వేల్లో బయటపడింది. బృందంగా మరింత పనిచేసేందుకు ఉద్యోగులు అంగీకరించారు’ అని మీషో మానవ వనరుల అధికారి ఆశిష్ కుమార్ సింగ్ వెల్లడించారు. మీషోను ఐఐటీ ఢిల్లీలో చదివిన విదిత్ ఆత్రేయ్, సంజీవ్ బమ్వల్ 2015లో ప్రారంభించారు. ఇందులో బట్టలు, ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు గృహోపకరణ వస్తువులు దొరుకుతాయి.