న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశీయ మార్కెట్లో వాహన విక్రయాలు పరుగులు పెడుతున్నాయి. గత నెల ఆగస్టులో దాదాపు అన్ని ఆటో రంగ సంస్థల అమ్మకాలు జోరుగా సాగాయి. కార్ల విభాగంలో మారుతి సుజుకీ, టాటా మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కియా రెండంకెల స్థాయి వృద్ధిని కనబర్చాయి. ఇక నిస్సాన్ మూడంకెల స్థాయిలో వృద్ధిరేటును నమోదు చేయడం గమనార్హం. ద్విచక్ర వాహన మార్కెట్లోనూ బజాజ్, టీవీఎస్, సుజుకీ అమ్మకాలు ఆకట్టుకున్నాయి. పండగ సీజన్ మొదలు కావడం, సెమీకండక్టర్ల కొరత తగ్గుముఖం పట్టడం పరిశ్రమకు కలిసొచ్చింది. తమ చేతిలో 3.77 లక్షల యూనిట్లకు సంబంధించి ఆర్డర్లున్నాయని మారుతి ప్రతినిధి శశాంక్ శ్రీవాత్సవ గురువారం తెలిపారు. మొత్తం పరిశ్రమలో పెండింగ్ ఆర్డర్లు 7-7.5 లక్షల యూనిట్ల స్థాయిలో ఉండొచ్చన్నారు.