న్యూఢిల్లీ: ఇండియాలో అతిపెద్ద కార్ల తయారీదారు మారుతి సుజుకీ( Maruti Suzuki ).. భారీ ఎత్తున తమ కార్లను రీకాల్ చేసింది. తయారీ లోపాలు ఉన్న సుమారు లక్షా 80 వేల కార్లను ఆ సంస్థ రీకాల్ చేసింది. కంపెనీ చరిత్రలో ఈ స్థాయిలో కార్లను రీకాల్ చేయడం ఇదే తొలిసారి. రీకాల్ అయిన మోడల్స్లో సియాజ్, ఎర్టిగా, విటారా బ్రెజా, ఎస్-క్రాస్, ఎక్స్ఎల్6 ఉన్నాయి. ఇవన్నీ 2018, మే 4 నుంచి 2020, అక్టోబర్ 27 మధ్య తయారైన కార్లు. నవంబర్ తొలి వారంలో ఈ కార్లలో ఉన్న లోపాన్ని సరి చేస్తామని మారుతి సుజుకీ చెప్పింది. అందులోని మోటార్ జెనరేటర్ యూనిట్ను ఉచితంగా మార్చనున్నట్లు తెలిపింది. లోపం ఉన్న కార్ల యజమానులకు ఆయా మారుతి షోరూమ్ల నుంచి మెసేజ్లు అందుతాయి.
ఈ లోపం సరి చేసే వరకూ భారీగా నీళ్లు నిలిచిన రోడ్లపైకి వెళ్లకూడదని, అలాగే అందులోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ భాగాలపై నేరుగా నీటిని స్ప్రే చేయకూడదని కంపెనీ కోరింది. ఒకవేళ మీ దగ్గర ఉన్న కొత్త మారుతి సుజుకీ కారులో కూడా ఇలాంటి లోపం ఉన్నట్లుగా సందేహిస్తే.. www.marutisuzuki.com సైట్(ఎర్టిగా, బ్రెజా)లోకి, www.nexaexperience.com సైట్ (సియాజ్, ఎక్స్ఎల్6, ఎస్-క్రాస్)లోకి వెళ్లి అక్కడ మీ వెహికిల్ చాసిస్ నంబర్ నమోదు చేయండి. వాహనం ఇన్వాయిస్/రిజిస్ట్రేషన్ పత్రాలపై ఈ చాసిస్ నంబర్ ఉంటుంది.