Maruti Suzuki | కరోనా తర్వాత పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం పెరిగింది. దీంతో దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కీర్తి కిరీటంలో మరో మైలురాయి నమోదైంది. గతేడాది రెండు లక్షలకు పైగా కార్లను వివిధ దేశాలకు ఎగుమతి చేసినట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. 2021లో 2,05,450 కార్లను ఎగుమతి చేశామని పేర్కొంది. ఒక ఏడాదిలో గతంలో ఎన్నడూ ఈ రికార్డు నమోదు చేయలేదని వెల్లడించింది.
మారుతి సుజుకి ప్రస్తుతం 15 మోడళ్ల కార్లు ఎగుమతి చేస్తున్నది. ఇటీవల విడుదల చేసిన జిమ్నీతోపాటు ఆల్ న్యూ సెలెరియో కూడా వీటిల్లో ఉన్నాయి. 2021లో మారుతి సుజుకి ఎగుమతి చేసిన వాటిలో టాప్-5లో బాలెనో, డిజైర్, స్విఫ్ట్, ఎస్-ప్రెస్సో, బ్రెజా ఉన్నాయి.
తమ సంస్థ నాణ్యత, టెక్నాలజీ, పనితీరుపై కస్టమర్ల విశ్వసనీయతకు ఇది మైలురాయి అని మారుతి సుజుకి ఇండియా ఎండీ కం సీఈవో కెనిచి అయుకవా పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల డిస్ట్రిబ్యూటర్లకు కార్ల ఎగుమతిలో తమకు మద్దతుగా నిలిచిన సుజుకి మోటార్ కార్పొరేషన్కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ప్రపంచ దేశాల కస్టమర్ల నమ్మకాన్ని కాపాడుకునేందుకు కట్టుబడి పనిచేస్తామన్నారు.
1986-87లో హంగారేతో మారుతి సుజుకి కార్ల ఎగుమతిని ప్రారంభించింది. ప్రస్తుతం 100కి పైగా దేశాలకు కార్లు ఎగుమతి చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 21.85 లక్షల కార్లను ఎగుమతి చేసింది. లాటిన్ అమెరికా, ఏషియన్, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఇరుగు పొరుగు రీజియన్లలో మారుతి కార్లు ప్రజాదరణ పొందాయి.