డిసెంబర్ చివరివారంలో బలమైన ర్యాలీ జరిపిన ఎన్ఎస్ఈ నిఫ్టీ జనవరి 1న 21,834 పాయింట్ల కొత్త రికార్డుస్థాయిని తాకింది. అటుతర్వాత నాలుగు రోజులూ కేవలం 250 పాయింట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యి, చివరకు 21,711 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు అమెరికా ఆర్థికవ్యవస్థ బలంగా ఉందనడానికి సంకేతంగా అక్కడ పటిష్ఠమైన జాబ్స్ డాటా వెలువడటంతో ఫెడ్ వడ్డీ రేట్లు వేగంగా తగ్గవన్న అంచనాలు ఏర్పడుతున్నాయి. దీంతో ప్రపంచ ప్రధాన స్టాక్ సూచీలు చిన్న రేంజ్లో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టీ గతవారపు ట్రేడింగ్ రేంజ్ను ఎటువైపు బ్రేక్ చేస్తే అటు కదలవచ్చని సామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమిత్ మోది చెప్పారు. ప్రస్తుతం మార్కెట్ 21,500-21,800 శ్రేణిలో కన్సాలిడేట్ అవుతున్నదని, బ్రేక్అవుట్ జరిగేంతవరకూ ఇదే శ్రేణికి పరిమితం అవుతుందని ఛాయస్ బ్రోకింగ్ రీసెర్చ్ అనలిస్ట్ సుమీత్ బగాడియా అన్నారు.
మద్దతు 21,500-21,600
ఎన్ఎస్ఈ డెరివేటివ్ డాటా ప్రకారం 21,500, 21,600 స్ట్రయిక్స్ వద్ద పుట్ రైటింగ్ జరిగినందున, ఈ స్థాయిలు నిఫ్టీకి మంచి మద్దతు అందించవచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ టెక్నికల్ హెడ్ రాజేశ్ పాల్వియా అంచనా వేశారు. నిఫ్టీ 21,600, 21,550 పాయింట్ల వద్దకు తగ్గితే 21,500 స్టాప్లాస్తో కొనవచ్చని ఇన్వెస్టర్లకు సూచించారు. గరిష్ఠస్థాయిలో 21,750 పాయింట్ల వద్ద అవరోధం కలగవచ్చని, ఈ స్థాయిని దాటితే షార్ట్ కవరింగ్ ప్రభావంతో 21,900 వరకూ పెరుగుతుందని విశ్లేషించారు. 22,000 స్థాయిని సైతం అందుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ వారం నిఫ్టీ 21,500 మద్దతును కోల్పోతే తదుపరి 21,350 పాయింట్ల వద్ద మద్దతు లభిస్తున్నదని, 21,750 నిరోధస్థాయిని దాటితే 21,950 స్థాయి తదుపరి అవరోధాన్ని కల్గించవచ్చని జిమిత్ మోది అంచనా వేశారు.