ముంబై, మే 20: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ ర్యాలీ భారతీయ సూచీలకు కలిసొచ్చింది. ఈ క్రమంలోనే వరుస రెండు రోజుల నష్టాలకు చెక్ పెడుతూ బుల్ రంకేసింది. దీంతో శుక్రవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 1,534.16 పాయింట్లు లేదా 2.91 శాతం పుంజుకుని 54,326.39 వద్ద స్థిరపడింది. గడిచిన మూడు నెలలకుపైగా కాలంలో ఒక్కరోజులో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి.
సెన్సెక్స్ 30లోని అన్ని షేర్లూ లాభాలను అందుకున్నాయి. డాక్టర్ రెడ్డీస్ షేర్ విలువ అత్యధికంగా 8.1 శాతం ఎగబాకింది. ఆ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ 5.77 శాతం లాభపడింది. నెస్లే ఇండియా, టాటా స్టీల్, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లూ మదుపరులను ఆకట్టుకున్నాయి. బీఎస్ఈ స్మాల్క్యాప్, మిడ్క్యాప్లు కూడా 2.13 శాతం, 1.98 శాతం చొప్పున పెరిగాయి. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 456.75 పాయింట్లు లేదా 2.89 శాతం ఎగిసి 16వేల మార్కుకు ఎగువన 16,266.15 వద్ద నిలిచింది. ఇక ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 1,532.77 పాయింట్లు లేదా 2.9 శాతం, నిఫ్టీ 484 పాయింట్లు లేదా 3.06 శాతం ఎగిశాయి.
ఆసియాలోని ప్రధాన మార్కైట్లెన జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, చైనా సూచీలు లాభాల్లో స్థిరపడ్డాయి. చైనా తమ ఐదేండ్ల రుణ రేటును తగ్గించడం మార్కెట్ సెంటిమెంట్ను బలపర్చిందని నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. ఐరోపా మార్కెట్లలోనూ కీలక సూచీలైన జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ లాభాల్లోనే కదలాడుతున్నాయి. అమెరికా సూచీలు మాత్రం నష్టాల్లో నడుస్తున్నాయి. ఇదిలావుంటే డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ శుక్రవారం కాస్త కోలుకున్నది.
స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసిన నేపథ్యంలో మదుపరుల సంపద కూడా అంతే స్థాయిలో పెరిగింది. బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.5,05,143.44 కోట్లు ఎగబాకి రూ.2,54,11,537.52 కోట్లకు చేరింది. రియల్టీ షేర్లు గరిష్ఠంగా 4.22 శాతం పుంజుకున్నాయి. ఆ తర్వాత మెటల్ (3.75 శాతం), క్యాపిటల్ గూడ్స్ (3.14 శాతం), ఇండస్ట్రియల్స్ (3.05 శాతం), హెల్త్కేర్ (3.04 శాతం), ఎనర్జీ (2.97 శాతం) షేర్లూ పెరిగాయి. గురువారం స్టాక్ మార్కెట్ల నష్టాల మధ్య మదుపరుల సంపద రూ.6.71 లక్షల కోట్లు కరిగిపోయిన విషయం తెలిసిందే.