Mark Zuckerberg | ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్బర్గ్ సెక్యూరిటీ అలవెన్స్ను భారీగా పెంచేసింది. మార్క్ జుకర్ బర్గ్ సహా ఆయన కుటుంబ సభ్యులకు ఇచ్చే సెక్యూరిటీ అలవెన్స్ను 4 మిలియన్ డాలర్ల నుంచి 14 మిలియన్ డాలర్లకు పెంచుతూ మెటా ప్లాట్ఫామ్స్ ఐఎన్సీ (Meta Platforms Inc) ప్రకటించింది.
ఇది భాతర కరెన్సీ ప్రకారం లెక్కిస్తే రూ.33 కోట్ల నుంచి రూ.115 కోట్లకు పెంచినట్లు. ఈ పెరిగిన సెక్యూరిటీ అలవెన్స్ జుకర్బర్గ్ మొత్తం భద్రతా ప్రోగ్రామ్ ఖర్చులతో పాటు ఉంటుందని, ప్రస్తుత పరిస్థితుల్లో తగినది, అవసరమైనది అని ఓ ఫైలింగ్లో మెటా వివరించింది.
మరోవైపు మార్క్ జుకర్బర్గ్.. ఫోర్బ్స్ లైవ్ బిలియనీర్ జాబితాలో 16వ స్థానంలో ఉన్నారు. ఆయన నికర విలువ 63 బిలియన్ డాలర్లు. అంటే సుమారు రూ.5.2 లక్షల కోట్లకు పైమాటే. 2021 లెక్కల ప్రకారం మార్క్ జుకర్బర్గ్ 27 మిలియన్ డాలర్ల వేతనాన్ని తీసుకున్నారు. భారతీయ కరెన్సీ ప్రకారం రూ.223 కోట్లు. 2022 సంవత్సరానికి ఆయన ఎంత జీతం తీసుకున్నారో వెల్లడించలేదు.
ఇదిలా ఉండగా.. గతేడాది నవంబర్లో కంపెనీలోని మొత్తం 87 వేల మంది ఉద్యోగుల్లో 11 వేల మందిని (దాదాపు 13% మందిని) తొలగిస్తున్నట్టు మెటా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆదాయంలో ఒడిదొడుకులు, పారిశ్రామిక కష్టాలను అధిగమించేందుకు ఈ చర్య చేపడుతున్నట్టు మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ తమ ఉద్యోగులకు రాసిన లేఖలో తెలిపారు. అయితే, రానున్న రోజుల్లో మెటాలో మరిన్ని లేఆఫ్స్ ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇటీవలే కంపెనీలో జరిగిన సమావేశంలో.. ‘కేవలం సిబ్బందితో పని చేయించడమే కాకుండా.. పనిలో వ్యక్తిగత పాత్ర ఉండాల్సిందే’ అని మేనేజర్లు, డైరెక్టర్ స్థాయి ఉద్యోగులను జుకర్ బర్గ్ హెచ్చరించారు. ఈ ఏడాది మరింత ఎఫీషియెన్సీ కనబరచాల్సిందే అని తేల్చిచెప్పారు. కోడింగ్, డిజైనింగ్, రీసెర్చ్ వంటి వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. లేనిపక్షంలో కంపెనీ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. జుకర్బర్గ్ వార్నింగ్తో ఆ సంస్థలోని ఉద్యోగుల్లో మరోసారి లేఆఫ్స్ భయాలు మొదలయ్యాయి.