Retail Inflation | దేశీయ మార్చి రిటైల్ ద్రవ్యోల్బణం నెమ్మదిగా దిగి వస్తున్నది. మార్చి రిటైల్ ద్రవ్యల్బణం ఐదు నెలల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది. గత ఫిబ్రవరిలో 5.09 శాతంగా నమోదైన రిటైల్ ద్రవ్యోల్బణం.. మార్చి నెలలో 4.85 శాతానికి దిగి వచ్చింది. పట్టణ చిల్లర ద్రవ్యోల్బణం 4.14 శాతం, గ్రామీణ చిల్లర ద్రవ్యోల్బణం 5.45 శాతంగా నమోదైంది. ఆహార ద్రవ్యోల్బణం 8.66 నుంచి 8.52 శాతానికి దిగి వచ్చింది. ఈ నెల ప్రారంభంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. ‘రిటైల్ ద్రవ్యోల్బణం గణనీయంగా దిగి వచ్చింది. కానీ నిర్దేశిత స్థాయి నాలుగు శాతానికంటే ఎక్కువగా నమోదైంది’ అని చెప్పారు.
సరిగ్గా రెండేండ్ల క్రితం 2022 ఏప్రిల్ రిటైల్ ద్రవ్యోల్బణం 7.8 శాతంగా నమోదైంది. దీంతో ద్రవ్యలభ్యత కఠినతరం చేసేందుకు ఆర్బీఐ వడ్డీరేట్లు పెంచేసిన సంగతి తెలిసిందే. సాధారణ వర్షపాతం నమోదైతే రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా రికార్డవుతుందని ఆర్బీఐ అంచనా వేస్తున్నది. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు, కమోడిటీ ధరలు, సరఫరా వ్యవస్థల్లో ఇబ్బందులు ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారి తీస్తాయని భావిస్తున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో 4.9 శాతం నుంచి సెప్టెంబర్ త్రైమాసికం నాటికి 3.8 శాతానికి దిగి వస్తుందని ఆర్బీఐ అంచనా వేస్తున్నది.