Shushil Mantri Arrest | దక్షిణ భారతంలో రియాల్టీ మేజర్గా పేరొందిన మంత్రి డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్- సీఈవో సుశీల్ మంత్రిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. ఆయన మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారని అధికార వర్గాలు తెలిపాయి. అరెస్ట్ చేసిన తర్వాత న్యాయస్థానం ముందు హాజరు పర్చగా.. విచారణ కోసం ఈడీ కస్టడీకి అప్పగించారని సమాచారం.బెంగళూరు నగరంలో ఇండ్ల కొనుగోలుదారుల నుంచి సేకరించిన సొమ్ము.. ఆయా ప్రాజెక్టులపై ఖర్చు చేయకుండా సుశీల్ మంత్రి సొంత అవసరాలకు వాడుకున్నారని ఈడీ దర్యాప్తులో తేలింది.
వివిధ ఆర్థిక సంస్థల నుంచి రూ.5000 కోట్ల రుణాలు తీసుకున్నారని, సుమారు రూ.1000 కోట్లు ఓవర్డ్యూ కలిగి ఉన్నారని ఈడీ వర్గాలు తెలిపాయి. సుశీల్ మంత్రి తీసుకున్న కొన్ని రుణాలను మొండి బకాయిగా ఆయా ఆర్థిక సంస్థలు ప్రకటించాయని ఆ వర్గాల కథనం.
పీఎంఎల్ఏ చట్టం 19 సెక్షన్ కింద సుశీల్ మంత్రిని కస్టడీకిలోకి తీసుకున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. 2020లో కంపెనీ డైరెక్టర్లు, ఉద్యోగులపై కేసు నమోదు కాగా, గత మార్చి 22న ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఒకే ప్రాజెక్టుపై వివిధ ఆర్థిక సంస్థల వద్ద రుణాల కోసం తాకట్టు పెట్టిందని ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 24న విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని సుశీల్ మంత్రికి ఈడీ సమన్లు జారీ చేసింది.
తనపై వచ్చిన అభియోగాలపై విచారణకు హాజరైన సుశీల్ మంత్రి దాటవేత సమాధానాలు ఇస్తూ సహాయనిరాకరణ ధోరణిని ప్రదర్శిస్తున్నాడని ఈడీ వర్గాలు తెలిపాయి. మంత్రి డెవలపర్స్ వ్యవహారాలను దాచి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆ వర్గాల కథనం. ఈడీ వర్గాలు అడిగిన సమాచారానికి సంబంధించిన పత్రాలు కూడా సమర్పించలేదని అధికారవర్గాల కథనం.