Narayana Murthy | మాజీ ప్రధాని మన్మోహన్సింగ్పై ఐటీ దిగ్గజం- ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయిందని వ్యాఖ్యానించారు. కానీ వ్యక్తిగతంగా మన్మోహన్ సింగ్ అసాధారణమైన వ్యక్తి అని కొనియాడారు. శుక్రవారం ఆయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) అహ్మదాబాద్ విద్యార్థులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. చైనాకు దీటుగా భారత్ను నిలిపే శక్తి సామర్థ్యాలు మన యువతకు ఉన్నాయన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంతో పోలిస్తే యూపీఏ ప్రభుత్వ హయాంలో విధాన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరిగేదని చెప్పారు.
`2008-12 మధ్య లండన్ హెచ్ఎస్బీసీ బోర్డు సభ్యుడిగా నేను ఉన్నప్పుడు తొలినాళ్లలో బోర్డు సమావేశాల్లో చైనా పేరు రెండు, మూడుసార్లు చర్చకు వచ్చేది. భారత్ పేరు ఒకసారి మాత్రమే ప్రస్తావనకు వచ్చేది` అని నారాయణమూర్తి అన్నారు. `దురదృష్టవశాత్తు తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. అసాధారణమైన వ్యక్తిగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంటే నాకు ఎంతో గౌరవం, కానీ భారత్ అభివృద్ధి స్తంభించింది. విధాన నిర్ణయాలు త్వరితగతిన తీసుకునే వారు కాదు. ప్రతిదీ ఆలస్యమయ్యేది. నేను (హెచ్ఎస్బీసీ) ని వీడినప్పుడు చైనా పేరు 30 సార్లు చర్చిస్తే భారత్ పేరు ఒక్కసారి కూడా చర్చకు వచ్చేది కాదు` అని అభిప్రాయ పడ్డారు. 1991 భారత ఆర్థిక సంస్కరణలకు సూత్రధారి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు.
`మేక్ ఇన్ ఇండియా`, `స్టార్టప్ ఇండియా` విధానాలను అమలు చేస్తున్నందుకు నరేంద్రమోదీ సారధ్యంలోని ఎన్డీఏ సర్కార్ను నారాయణ మూర్తి ప్రశంసల్లో ముంచెత్తారు. `గతంలో పలు దేశాల పౌరులు భారత్ వైపు చూసేవారు. ప్రపంచంలోనే ఐదో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థగా ఈనాడు భారత్కు సరైన గుర్తింపు లభించింది. 1978-2022 మధ్య 44 ఏండ్లు. భారత్ను చైనా ఆరు రెట్లు వెనక్కు నెట్టేసింది. కానీ చైనాతోపాటు భారత్కు సరైన గుర్తింపు తీసుకు రాగల శక్తి సామర్థ్యాలు దేశ యువతకు ఉన్నాయి. భారతీయ యువత ఆ పని చేయగలుగుతుంది` అని వ్యాఖ్యానించారు.