Maruti Concern 6 Airbags | రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కార్లలో 6 ఎయిర్బ్యాగులు తప్పనిసరి అంటూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) చైర్మన్ ఆర్సీ భార్గవ భిన్నంగా స్పందించారు. కేంద్రం నిర్ణయం వల్ల చిన్న కార్ల మార్కెట్ కుంచించుకుపోతుందని, ఆటోమొబైల్ రంగ ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు. కనుక ఈ ప్రాతిపాదనను పునఃపరిశీలించుకోవాలని కేంద్రాన్ని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధన ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ కార్ల తయారీపై భారీగా ప్రభావం చూపుతుందని ఆర్సీ భార్గవ ఆందోళన వ్యక్తం చేశారు. మూడేండ్లుగా కార్ల విక్రయాలు పడిపోయాయని, ఆటోమొబైల్ పరిశ్రమ పలు సవాళ్లను ఎదుర్కొంటున్నదని తెలిపారు. దీనివల్ల ద్విచక్ర వాహన చోదకులు.. బుల్లికార్లలోకి మారడం చాలా కష్టంగా మారుతుందని పేర్కొన్నారు.
కర్బన ఉద్గారాలను తగ్గించడానికి 2020 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బీఎస్-6 ప్రమాణాలతోపాటు కొన్నేండ్లుగా ఎంట్రీ లెవెల్ కార్లపై పలు నియంత్రణ నిబంధనలు అమలు చేస్తున్నారని ఆర్సీ భార్గవ తెలిపారు. దీని ప్రభావం చిన్న కార్ల తయారీపై పడుతున్నదని పేర్కొన్నారు. తయారీ ఖర్చు .. తదనుగుణంగా వాటి ధరలు పెరుగుతున్నదని వెల్లడించారు. ఫలితంగా నాన్ మెట్రో మార్కెట్లలో సేల్స్ పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎయిర్బ్యాగుల నియంత్రణ నిబంధనతో కార్ల తయారీ ధర మరింత పెరిగిపోయి, దేశీయ మార్కెట్లో చిన్న కార్ల పరిశ్రమ కుంచించుకు పోతుందని ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. కార్ల విక్రయంతో విడి భాగాలు, మరమ్మతు, కార్ల నిర్వహణ, నడిపేందుకు డ్రైవర్లు అవసరం అని, దీనివల్ల బోలెడు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. కార్ల తయారీ రంగం భారీ ఉపాధి కల్పన రంగం అని తెలిపారు.