Vijay Mallya | విజయ్మాల్య.. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు. ప్రస్తుతం లండన్లో బెయిల్పై ఉన్న విజయ్ మాల్య.. ఒకప్పుడు భారత్లో పేరొందిన మద్యం వ్యాపారి. కింగ్ ఫిషర్స్ పేరిట ఎయిర్లైన్స్ ప్రారంభించిన విజయ్ మాల్య వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించలేదు. దీంతో ఆయన్ను ఎగవేతదారుగా ప్రకటించేలోగా దేశం విడిచి పారిపోయాడు. అయితే, అంతకుముందు బ్రిటన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డియాజియో సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రూ.317 కోట్లు (40 మిలియన్ల డాలర్లు) నిధులు వచ్చాయి. ఆ నిధులు తన కొడుకు సిద్ధార్థ, కుమార్తెలు లీలా మాల్య, టాన్యా మాల్యలకు 13 మిలియన్ల డాలర్ల చొప్పున పంచేశాడు.
ఈ క్రమంలో న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించాడు విజయ్మాల్య. దీనిపై బ్యాంకులన్నీ కోర్టుకెళ్లాయి. ఈ విషయమై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నాలుగు వారాల్లో రూ.317 కోట్లతోపాటు 8 శాతం వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. ఫైన్ కూడా విధించింది. ఈ మొత్తం చెల్లించకపోతే రెండు నెలలు అదనపు జైలుశిక్షఅనుభవించాలని కూడా తీర్పు చెప్పింది. ఈ మొత్తం చెల్లించాలని సిద్దార్థ మాల్య, కూతుళ్లు లీనా, టాన్యాలను ఆదేశించింది. ఒకవేళ సకాలంలో చెల్లింపులు జరగకపోతే, వారి ఆస్తులు జప్తు చేస్తామని న్యాయస్థానం తేల్చేసింది. అయితే, కూతుళ్లు లీలా, టాన్యా కలిసి రూ.211.33 కోట్లు చెల్లించడానికి సిద్ధమయ్యారట.
విజయ్మాల్య మొదటి భార్య సమీరా కొడుకు సిద్ధార్థ్ మాల్య. కొన్నేండ్ల తర్వాత సమీరాతో విడిపోయాక రేఖను పెండ్లాడాడు. మాల్య, రేఖ దంపతులకు లీనా, టాన్యా అనే కూతుళ్లు ఉన్నారు. టాన్యాకు ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఫొటోగ్రఫీ కోర్సు నేర్చుకునేందుకు 2013లో పారిస్ వెళ్లారామే. విజయ్ మాల్య మరో కూతురు లీనా ఒక వ్యాపార వేత్త, శాన్ఫ్రాన్సిస్కోలో జీవిస్తున్న లీనా అమెరికా పౌరురాలు కూడా.
విజయ్మాల్య రెండో భార్య రేఖకు అంతకుముందే మెహమూద్ అనే వ్యక్తితో పెండ్లయింది. రేఖ, మెహమూద్లకు లైలా అనే కూతురు ఉండేది. రేఖను పెండ్లి చేసుకున్నాక లైలాను విజయ్మాల్య దత్తత తీసుకున్నాడు.