న్యూఢిల్లీ, ఆగస్టు 19: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా.. ఎక్స్యూవీ700 వాహన వినియోగదారులకు షాకిచ్చింది. వైరింగ్ సమస్యలు తలెత్తడంతో లక్ష యూనిట్ల ఎక్స్యూవీ700 మాడళ్లను రీకాల్ చేస్తున్నట్లు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. జూన్ 8, 2021 నుంచి జూన్ 28, 2023 లోపు ఉత్పత్తైన 1,08,306 యూనిట్ల ఎక్స్యూవీ700 వాహన వైరింగ్ విషయంలో లోపాలు గుర్తించినట్లు, తగు మార్పులు చేసి వినియోగదారులకు తిరిగి అందచేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. వీటితోపాటు ఫిబ్రవరి 16, 2023 నుంచి జూన్ 5, 2023 లోపు తయారైన 3,560 యూనిట్ల ఎక్స్యూవీ400 వాహనాలను కూడా వెనక్కి పిలిపిస్తున్నట్లు తెలిపింది. ఈ వాహనాల్లో బ్రేక్ పొటెన్షియోమీటర్ స్ప్రీంగ్ రిటర్న్ యాక్షన్లో లోపాలు ఉన్నట్లు అనుమానాలున్నాయని పేర్కొంది. దీంతో కార్లను కొనుగోలు చేసిన వారికి ఉచితంగా మరమ్మత్తులు చేసి ఇవ్వనున్నట్లు, ఇందుకోసం అవసరమైన విడిభాగాలను ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది.