Anand Mahindra : సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఆనంద్ మహీంద్రా తన అధికార ఎక్స్ ఖాతాలో మరో పోస్ట్ పెట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బస్తి జిల్లాకు చెందిన ఓ 13 ఏళ్ల బాలికకు ఆయన ఉద్యోగం ఆఫర్ చేశారు. సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి.. ఇటీవల కోతుల దాడి నుంచి ఏడాది వయస్సున్న తన మేనకోడలును కాపాడుకున్న బాలికపై ప్రశంసలు కురిపించారు. ఆమె పెరిగి పెద్దదైన తర్వాత తాను ఉద్యోగం ఇస్తానని పేర్కొన్నారు.
మనం సాంకేతికలో నిష్ణాతులుగా మారుతున్నామా.. లేదంటే దానికి బానిసలుగా మారుతున్నామా..? అనే సమాధానం లేని ప్రశ్న వినిపిస్తున్న వేళ ఆ బాలిక సాంకేతికతను సరిగ్గా వినియోగించి చూపించిందని ఆనంద్ మహీంద్రా కొనియాడారు. ఆమె సమయ స్ఫూర్తి ఆసాధారణమని పేర్కొన్నారు. ఆమె చదువు పూర్తయిన తర్వాత కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేయాలనుకుంటే.. మా కంపెనీలో చేరేలా ఆమెను మేం ఒప్పిస్తామని తెలిపారు. ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బస్తి జిల్లాలోని ఓ గ్రామంలో ఇంట్లోకి జొరబడిన కోతుల మూకను తరిమేందుకు పదమూడేళ్ల బాలిక మంచి ఎత్తుగడ వేసింది. దాంతో కోతులు తోక ముడిచుకుని పారిపోయాయి. వివరాల్లోకి వెళ్తే.. ఆ ఊళ్లో పంకజ్ ఓఝా అనే పెద్దాయన ఇంటికి ఇటీవల బంధువులు వచ్చారు. తర్వాత వాళ్లు బయలుదేరడంతో వారిని సాగనంపేందుకు పంకజ్ కుటుంబసభ్యులు కూడా కిందకు వెళ్లారు. ఇంట్లో నికిత అనే 13 ఏండ్ల బాలిక, 15 నెలల వయస్సున్న ఆమె మేనకోడలు మాత్రమే ఉన్నారు.
పంకజ్ కుటుంబసభ్యులు కిందకు వెళ్లేటప్పుడు గేటు వేయకపోవడంతో ఒక కోతుల గుంపు ఇంట్లోకి ప్రవేశించింది. అప్పుడు నికిత తన మేనకోడలితో ఆడుకుంటోంది. కోతులను చూడగానే ఆమెకు నోట మాటరాలేదు. అయితే కొన్ని క్షణాల్లోనే తేరుకుని సమయస్ఫూర్తిని ఉపయోగించింది. తమ ఇంట్లో ఉన్న అమెజాన్ వాయిస్ సర్వీస్ పరికరం ‘అలెక్సా’కు కుక్కలా మొరగమని ఆదేశాలు ఇచ్చింది. వెంటనే అది కుక్కలా శబ్దం చేసింది. దాంతో కుక్క ఉందనే కోతులు పారిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న ఆనంద్ మహీంద్రా బాలికకు జాబ్ ఆఫర్ చేశారు.