హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): కొనుగోలుదారుల ప్రయోజనాలకే అత్యధిక ప్రాధాన్యతనిస్తామని తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్ సత్యనారాయణ స్పష్టం చేశారు. పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించాలనేదే తమ లక్ష్యమని తెలిపారు. అన్ని అనుమతులు ఉన్నవాటినే కొనుగోలు చేయాలని సూచించిన ఆయన.. కొనుగోలుదారులకు ఇబ్బందులు లేకుండా ఆన్లైన్లో ఫిర్యాదులు చేసే వెసులుబాటు కల్పిస్తామన్నారు. అలాగే వర్చువల్ విధానంలో విచారణకూ హాజరయ్యే అవకాశాన్ని కల్పిస్తామంటున్న సత్యనారాయణ.. ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
జాతీయ స్థాయిలో జరిగిన ఒక అధ్యయనంలో ప్రజలు తాము పొదుపు చేసిన మొత్తంలో 77 శాతాన్ని ఇంటిని, ఇంటి స్థలాన్ని కొనుగోలు చేయడానికే వెచ్చిస్తున్నారని తేలింది. ప్రజలు ఇండ్లకు, ఇండ్ల స్థలాలకు అంత ప్రాధాన్యతనిస్తున్నారు. అలాంటిది ఈ రంగంలో కొనుగోలుదారులను మోసం చేయడం, ఆ డబ్బును దుర్వినియోగపర్చడం, అగ్రిమెంట్ ప్రకారం నిర్మించకపోవడం, సమయానికి అందించకపోవడం వంటివి పరిపాటైపోయాయి. వీటిపై చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే రెరా చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ చట్టం ద్వారా కొనుగోలుదారుల ప్రయోజనాలకు రక్షణ ఉంటుంది.
కొనుగోలుదారులు ఫిర్యాదు చేయడానికి ఇప్పటిదాకా స్వయంగా రెరా కార్యాలయానికే రావాల్సి వస్తున్నది. అందుకే ఆ అవసరం లేకుండా ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేసేలా త్వరలో ఓ ఆన్లైన్ వ్యవస్థను తెస్తున్నాం. ఆన్లైన్లోనే విచారణకూ హాజరుకావచ్చు. దీనివల్ల బాధితులకు రవాణా తదితర ఖర్చులు, ఇతరత్రా ఇబ్బందులు తప్పుతాయి. నిబంధనలు పాటించనివారిపై తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ చట్టం 2016, తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ రూల్స్ 2017 ప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రజలు కూడా రెరా, హెచ్ఎండీఏ, డీటీసీపీ, స్థానిక సంస్థల అనుమతులు తీసుకున్న వాటినే కొనుగోలు చేయాలి. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, బ్రోకర్లు కూడా రెరాలో నమోదు కావాలి.
అన్డివైడెడ్ షేర్, ప్రీ లాంచ్ ఆఫర్లు, ఈవోఐ వంటివి చేస్తే చర్యలు తీసుకుంటాం. దీని కోసం రెరాలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాం. 500 చదరపు మీటర్ల స్థలం కంటే ఎక్కువ, 8 కంటే ఎక్కువ ఫ్లాట్లను నిర్మించేవారందరూ రెరా పరిధిలోకి వస్తారు. వీటన్నింటికి పట్టణ, స్థానిక సంస్థలు, హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమతులు తీసుకోవాలి. అదే సమయంలో రెరా వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇవి లేకుండా ఆఫర్లు అంటూ మీడియాలో ప్రకటనలు చేస్తే కఠిన చర్యలే. ఫ్లాట్లు, ప్లాట్ల విక్రయాల కోసం తీసుకున్న మొత్తంలో 70 శాతం ఆ ప్రాజెక్టుపైనే ఖర్చు చేయాలి. దీని కోసం ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతా తెరవాలి. నగదు డ్రా చేయాలంటే ప్రాజెక్టు ఇంజినీర్, ఆర్కిటెక్ట్, చార్టెడ్ అకౌంటెంట్ సంతకాలుండాలి. నిధుల ఖర్చుపై ప్రతి 3 నెలలకోసారి రెరాకు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన ప్రాజెక్టుల వివరాలను కస్టమర్లు సులువుగా తెలుసుకోవడానికి వీలుగా ఒక్కో ప్రాజెక్టు వివరాలతో క్యూఆర్ కోడ్ను రూపొందించాలని నిర్ణయించాం. త్వరలో ఈ సౌలభ్యం అందుబాటులోకి వస్తుంది.
ఒప్పందం ప్రకారం నిర్మాణం జరగాలి. నిర్ణీత సమయంలోగా ప్లాటును, ఫ్లాటును అందించాలి. లేకుంటే కొనుగోలుదారుడు ఫిర్యాదు చేస్తే సంబంధిత సంస్థను పిలిపించి, విచారణ చేసి, తప్పని తెలితే మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం వరకు జరిమానా విధిస్తాం. రెండోసారీ అలాగే చేస్తే ఫైన్తోపాటు మూడేండ్ల జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. రెరాలో ఉన్న సదుపాయాలను ప్రజలతోపాటు రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లకు వివరిస్తాం.