ప్రపంచ కుబేరుడు, గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా కంపెనీ యూనిట్ ఏర్పాటు చేయాలని ఆహ్వానించడంలో తెలంగాణతోపాటు మరో మూడు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. టెస్లా సీఈవో ఎలన్మస్క్ను తెలంగాణలో టెస్లా యూనిట్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆహ్వానించారు. ఎలన్మస్క్తో కలిసి పని చేసేందుకు సిద్ధమని తెలిపారు.
హే ఎలన్.. నేను భారత్లోని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రిని. భారత్లో లేదా తెలంగాణలో షోరూమ్ ఏర్పాటు చేయడానికి ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు టెస్లాతో పార్టనర్ కావడానికి సంతోషిస్తాం. భారత్లోనే అగ్రశ్రేణి వ్యాపార కేంద్రంగా.. సస్టెయినబిలిటీ ఇన్షియేటివ్స్లో తెలంగాణ చాంపియన్గా నిలిచింది అని కేటీఆర్ ట్వీట్ చేశారు. పరిశ్రమల ఏర్పాటు కోసం అనుకూల సుస్థిర నిర్ణయాలు తీసుకోవడంలో తెలంగాణ ముందు ఉన్నదని తెలిపారు.
తెలంగాణతోపాటు కంపెనీ స్థాపించడానికి తమ రాష్ట్రానికి రావాలని మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాలు కూడా టెస్లా కంపెనీ సీఈవో ఎలన్మస్క్ను ఆహ్వానించాయి. గమ్మత్తేమిటంటే దేశీయంగా కర్ణాటకలో టెస్లా కంపెనీ రిజిస్ట్రేషన్ జరిగింది. భారత్లో ప్రవేశించడానికి కేంద్రం నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయన్న ఎలన్మస్క్ ట్వీట్కు మహారాష్ట్ర మంత్రి జయంత్ పాటిల్ రియాక్టయ్యారు. మహారాష్ట్ర దేశంలోనే వేగంగా పురోగమిస్తున్న రాష్ట్రం. మా రాష్ట్రంలో మీ తయారీ కేంద్రం ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తున్నాం అని ట్వీట్ చేశారు. ఈ ట్విట్కు ఎలన్మస్క్ను ట్యాగ్ చేశారు.
తెలంగాణ, మహారాష్ట్ర బాటలో పశ్చిమ బెంగాల్ మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి మహ్మద్ గులాం రబ్బానీ పయనించారు. ఉత్తమ మౌలిక వసతులకు పశ్చిమబెంగాల్ పెట్టింది పేరు. మా నాయకురాలు విజన్ కలిగి ఉన్నారు. బెంగాల్ అంటేనే బిజినెస్ అని ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్లో టెస్లా యూనిట్ ఏర్పాటు చేసేందుకు రావాలని ఆహ్వానించారు. దీనిపై బీజేపీ నేత అమిత్ మాలవీయ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 14 ఏండ్ల క్రితం టాటా నానో కార్ల ప్రాజెక్టు పశ్చిమ బెంగాల్ నుంచి తరలి వెళ్లడానికి తృణమూల్ కాంగ్రెస్ కారణమని ఎద్దేవా చేశారు.
ఇదిలా ఉంటే పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవ్జ్యోత్ సింగ్ సిద్దూ కూడా జాయినయ్యారు. తమ రాష్ట్రంలో తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని ఎలన్మస్క్ను ఆహ్వానించారు. లుధియానాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ బ్యాటరీ ఇండస్ట్రీ హబ్ క్రియేట్ చేస్తాం. పంజాబ్కు నూతన టెక్నాలజీతో పెట్టుబడులు పెట్టడానికి.. వచ్చే వారికి నిర్దిష్ట గడువుతో కూడిన సింగిల్ విండో క్లియరెన్స్ ఇస్తాం. పర్యావరణ పరిరక్షణతోపాటు సుస్థిర అభివృద్ధి సాధనకు, పర్యావరణ హిత ఉద్యోగాలు కల్పించే వారికి స్వాగతం పలుకుతామని పేర్కొన్నారు.